జైపూర్: రాజస్థాన్లోని కోటాలో (Kota) విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక 19 ఏండ్ల విద్యార్థిని బలవన్మరణం చెందింది. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన సౌమ్య (Soumya).. ఓ హాస్టల్ ఉంటూ నీట్ (NEET) పరీక్షకు సన్నద్ధమవుతున్నది. ఈ క్రమంలో హాస్టల్లోని తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. దీంతో రెండు రోజుల్లోనే ఇద్దరు చనిపోయినట్లయింది. మొత్తంగా కోటాలో ఈ ఏడాది ఇది ఎనిమిదో ఆత్మహత్య. కాగా, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, వారు కోటాకు వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.
ఈ నెల 25న ఉరుజ్ ఖాన్ అనే నీట్ విద్యార్థి ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయాడు. అతడు కూడా యూపీకి చెందినవాడే కావడం గమనార్హం. విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గతేడాది కోటాలో 29 మంది ఆత్మహ్య చేసుకున్నారు. వారంతా నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నవారే కావడం విశేషం.