న్యూఢిల్లీ: జనవరి 6వ తేదీలోగా నీట్ పీజీ కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ హామీ ఇచ్చారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అధ్యక్షుడు సహజానంద్ ప్రసాద్ సింగ్ శుక్రవారం తెలిపారు. ఆందోళనల్లో పాల్గొన్న వైద్యులపై ఎలాంటి కేసులు ఉండవని చెప్పారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నీట్ కౌన్సెలింగ్ జాప్యాన్ని నిరసిస్తూ గత రెండు వారాలుగా చేపడుతున్న సమ్మెను రెసిడెంట్ వైద్యులు విరమించారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి విధులకు హాజరయ్యారు. కౌన్సెలింగ్ నిర్వహణ, కేసుల ఎత్తివేతకు సంబంధించి కేంద్రం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆందోళనలను విరమిస్తున్నట్టు ‘ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్’ (ఫోర్డా) ఓ ప్రకటనలో పేర్కొన్నది.