తిరువనంతపురం, జూలై 19: మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్కు హాజరైన విద్యార్థినిని లోదుస్తులు తొలగింపజేసి అనుమతించారన్న వార్త పూర్తిగా నిరాధారమని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి పరీక్షా కేంద్రం సూరింటెండెంట్ తెలిపారు. ఇది దురుద్దేశాలతో ప్రచారం చేసిన ఊహాకల్పిత వార్త అని పేర్కొన్నారు. కాగా తమకు ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎన్టీఏ అధికారులు చెప్పారు. కేరళ కొల్లాం జిల్లాకు చెందిన 17 ఏండ్ల అమ్మాయిని లోదుస్తులు తీసేసిన తర్వాతనే పరీక్ష రాయనిచ్చారని ఆమె తండ్రి ఓ టీవీ చానెల్కు చెప్పారు.
నీట్ బులెటిన్లో లోదుస్తులకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేనప్పటికీ ఆమెను మాత్రం ఇబ్బంది పెట్టారని అన్నారు. కేరళ పోలీసులు తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఇలాంటి విషయాల్లో వివక్షకు, అసౌకర్యానికి నీట్ వీలు కల్పించదని ఎన్డీఏ అధికారి ఒకరు అన్నారు. మరోవైపు కేరళ విద్యామంత్రి ఆర్ బిందు కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ఘాటైన లేఖ రాశారు. ఆడపిల్లల గౌరవమర్యాదలను మంటగలిపారని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించే ముందు అమ్మాయిల లోదుస్తులు తీసేయించిన పరీక్షా సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈ ఉదంతంపై ఐదుగురు మహిళలను అరెస్టు చేశారు.
బ్రా తీసి చేతిలో పట్టుకొని లైనులో నిల్చున్నా
నీట్ పరీక్షకు వెళ్తే ఎదురైన అవమానకరమైన పరిస్థితిని ఓ కేరళ అమ్మాయి మీడియాతో పంచుకుంది. ‘బ్రాలు తీసేసి చేతిలో పట్టుకుని లోపలకు వెళ్లండి.. లేకపోతే అనుమతించం’ అని సిబ్బంది బెదిరించారని ఆమె తెలిపింది. ‘బ్రాను టేబుల్ మీద పెట్టి లోపలకు వెళ్లమనడంతో కంగారుగా లోపలకు వెళ్లాను.. తలవెంట్రుకలను ముందుకు వేసుకుని పరీక్ష రాశా’ అని చెప్పింది. పరీక్ష తర్వాత బయటకు వస్తే బ్రాల కోసం వెదుకులాట జరిగిందని తెలిపింది.
మెడికో సీటుకు 20 లక్షలు రిగ్గింగ్పై సీబీఐ వర్గాలు
మెడికల్ సీట్ల స్కామ్లో ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. బీహార్, యూపీ, మహారాష్ట్ర, హర్యానాల్లో ఈ మాఫియా విస్తరించిందని, నకిలీ వ్యక్తులు పరీక్షలకు హారయ్యారని సీబీఐ వర్గాలు తెలిపాయి. సీటు గ్యారంటీ అంటూ ఇందుకు ఒక్కొక్కరి నుంచి రూ.20 లక్షలు వసూలు చేశారని, అందులో రూ.5 లక్షలు పరీక్ష రాసిన వ్యక్తికి అందజేశారని తెలుస్తున్నది. ఢిల్లీకి చెందిన సుశీల్ రంజన్ అనే వ్యక్తి ఈ కుంభకోణానికి సూత్రధారి సీబీఐ తెలిపింది.