న్యూఢిల్లీ/భోపాల్/రాయ్పూర్, నవంబర్ 17: మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలు పలు చోట్ల ఘర్షణలు, ఉద్రిక్తతల మధ్య ముగిశాయి. మధ్యప్రదేశ్లో 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతగా, ఛత్తీస్గఢ్లో 70 స్థానాలకు రెండో(తుది) విడత ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరిగింది. కడపటి వార్తలు అందే సమయానికి మధ్యప్రదేశ్లో 76.22 శాతం, ఛత్తీస్గఢ్లో 74 శాతం ఓటింగ్ నమోదైంది. సంబంధిత పత్రాల పరిశీలన తర్వాత కచ్చితమైన ఓటింగ్ శాతం శనివారం వెల్లడవుతుందని అధికారులు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని రాజ్నగర్ నియోజకవర్గంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో కాంగ్రెస్ అభ్యర్థి అనుచరుడు ఒకరు మరణించారు. ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లాలో ఒక కేంద్రంలో పోలింగ్ అనంతరం సిబ్బంది తిరిగి వెళ్తుండగా నక్సలైట్లు పేలుడు జరిపారు. ఈ ఘటనలో సిబ్బందికి ఎస్కార్ట్గా ఉన్న ఐటీబీపీ జవాన్ మృతిచెందారు.
మధ్యప్రదేశ్లోని పలు చోట్ల ఘర్షణలు
మధ్యప్రదేశ్లోని ఛతార్పూర్ జిల్లా రాజ్నగర్లో రెండు పార్టీల గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘర్షణల్లో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమ్ సింగ్ అనుచరుడు ఒకరు మరణించాడని జిల్లా ఎస్పీ అమిత్ సంఘి వెల్లడించారు. రాష్ట్రంలోని పలు ఇతర చోట్ల కూడా ఘర్షణలు చోటుచేసుకొన్నాయి. ఇండోర్ జిల్లా మహూ ఏరియాలో రెండు గ్రూపుల మధ్య వాగ్వివాదంలో ఐదుగురు గాయపడ్డారు. మోరేనా జిల్లా దిమాని నియోజకవర్గంలోని ఓ గ్రామంలో ఓటేసేందుకు వెళ్తున్న వారిని కొంత మంది అడ్డుకోవడంతో జరిగిన ఘర్షణల్లో ఇద్దరికి గాయాలయ్యాయి.
పోలింగ్ సిబ్బందికి ఎస్కార్ట్గా వెళ్తుండగా..
ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లాలో మణిపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో నక్సల్స్ జరిపిన పేలుళ్లలో ఐటీబీపీ జవాన్ మరణించారు. పోలింగ్ అనంతరం సిబ్బందికి ఐటీబీపీ హెడ్కానిస్టేబుల్ జోగిందర్ శర్మ ఎస్కార్ట్గా వెళ్తున్నారు. ఈ క్రమంలో బడే గోబ్రా గ్రామం సమీపంలో నక్సల్స్ పేలుడు జరిపారని పోలీసులు వెల్లడించారు.
నియోజకవర్గంలో ఎన్నికల సిబ్బంది అంతా మహిళలే
ఎన్నికల నిర్వహణలో అతివలు సత్తా చాటారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్ బూత్లలో పూర్తిగా మహిళా బృందాలే విధులు నిర్వహించిన ఘటన దేశ ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా ఛత్తీస్గఢ్లో చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన రెండో, ఆఖరి విడత పోలింగ్లో రాయ్పూర్ (నార్త్) నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన 201 పోలింగ్ బూత్లలో ఎన్నికల విధులన్నీ మహిళలే నిర్వహించారు. పురుషుల ప్రమేయం లేకుండా, అన్ని విభాగాలలో మహిళలే విధులు నిర్వహించారు. ఇది దేశంలోనే తొలిసారని ఎన్నికల సంఘం ప్రకటించింది.