గువాహటి: అస్సాం (Assam) రాష్ట్రాన్ని వరదలు (Floods) ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నది. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఊర్లకు ఊర్లే చెరువులుగా మారిపోవడంతో దాదాపు 4లక్షల 96 వేల మంది వరదల్లో చిక్కుకుపోయారు.
అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (ASDMA) ప్రకారం.. బజలి, బక్సా, బార్పేట, బిశ్వనాథ్, చిరాంగ్, దర్రాంగ్, ధేమాజీ, ధుబ్రి, డిబ్రూగఢ్, గోలాఘాట్, హోజాయ్, కమ్రూప్, కోక్రాఝర్, లఖింపూర్, నాగావ్, నల్బరి, సోనిట్పూర్, తముల్పూర్ జిల్లాల్లోని 58 రెవెన్యూ సర్కిళ్లలో ఉన్న 1366 గ్రామాలు ముంపునకు గురయ్యాయి.

బజలిలో సుమారు 2.60 లక్షల మంది, నల్బరీ జిల్లాలో 77,702 మంది, బార్పేట జిల్లాలో 65,221 మంది, బక్సాలో 24,023 మంది, లఖింపూర్ లో 25,613 మంది, తముల్పూర్లో 19,208 మంది, దర్రాంగ్లో 13,704 మంది, కోక్రాఘర్లో 6538 మంది ప్రభావితులయ్యారు. మరోవైపు వరదల కారణంగా 14,091.90 హెక్టార్లలో పంట నీటమునిగింది. 3,46,639 పెంపుడు జంతువులు కూడా వరదల వల్ల ప్రభావితమయ్యాయి.

Assam
మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF), ఫైర్, ఎమర్జెన్సీ సర్వీసెస్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 11 వరద ప్రభావిత జిల్లాల్లో 83 పునరావాస శిబిరాలు, 79 సహాయ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు 14,035 మంది ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.