న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ అడిషనల్ కమిషనర్(క్రైమ్ బ్రాంచ్)తో పాటు దాదాపు 1,000 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసు వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. కరోనా బారిన పడ్డ పోలీసులందరూ క్వారంటైన్లో ఉన్నారని పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత వీరంతా విధులకు హాజరవుతారని తెలిపారు. ఢిల్లీ పోలీసు శాఖలో మొత్తం 80 వేల మంది పని చేస్తున్నారు.
ఢిల్లీలో కరోనా వైరస్ నివారణకు పోలీసులు నిర్విరామంగా పని చేస్తున్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని విధులు నిర్వర్తించినప్పటికీ కరోనా సోకడంతో మిగతా ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులందరూ ఫేస్ మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటి వరకు కూడా వ్యాక్సిన్ తీసుకోని పోలీసులతో పాటు వారి కుటుంబాలు తక్షణమే టీకాను తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. వ్యాక్సిన్పై అందరిలో అవగాహన పెంచాలని సూచించారు. సోమవారం ఉదయం వరకు దేశ వ్యాప్తంగా 1.79 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. కరోనా పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉంది. పది రోజుల క్రితం 10 వేల నుంచి 15 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పుడు ఆ సంఖ్య పదింతలు దాటిపోయింది.