న్యూఢిల్లీ, ఏప్రిల్ 16 : దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరేందుకు సిద్ధమవుతున్న ఆకాశ ఎయిర్ విమానాన్ని, అదే సమయంలో పార్కింగ్ వైపు ప్రయాణిస్తున్న స్పైస్జెట్ విమానం తాకుతూ వెళ్లింది. ఈ ఘటనలో స్పైస్జెట్ విమానం కుడి వైపు వింగ్లెట్ దెబ్బతినగా, ఆకాశ ఎయిర్ విమానం ఎడుమవైపు భాగం స్వల్పంగా దెబ్బతిన్నది.
వెంటనే స్పందించిన విమానాశ్రయ అధికారులు, ఆకాశ ఎయిర్ విమానంలోని ప్రయాణికులు, ఇతర సిబ్బందిని కిందికి దింపారు. ప్రయాణికులను హైదరాబాద్కు పంపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు ‘ఆకాశ ఎయిర్’ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ప్రమాదంలో అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై డీజీసీఏ తీవ్రంగా స్పందించింది. ఎక్కడ లోపం జరిగిందనే అంశంపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టామని డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాద కారణంగా రెండు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.