ముంబై, జూలై 1: మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గంటల వ్యవధిలోనే విపక్షాలపై బీజేపీ కక్ష సాధింపులను మొదలుపెట్టింది. ఎంవీఏలో కీలక భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 2004, 2009, 2014, 2020 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల వివరాలు తెలియజేయాల్సిందిగా ఐటీ నోటీసులు అందినట్టు పవార్ వెల్లడించారు. ఈ నోటీసులను ప్రేమలేఖలుగా ఆయన అభివర్ణించారు. ‘ఐటీ నుంచి నాకు ప్రేమలేఖలు అందాయి. 2004, 2009లో లోక్సభ, 2014, 2020లో రాజ్యసభ ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ వివరాలను వాళ్లు కోరారు. నా దగ్గర ఆ వివరాలన్నీ ఉన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఐదేండ్ల క్రితం వరకూ ఈడీ అంటే ఏమిటో తెలియదు. అయితే, ఇప్పుడు పల్లెల్లో ఉన్నవాళ్లు కూడా దానిపై జోకులు పేలుస్తున్నారు’ అని అన్నారు.