నాసిక్: ఉల్లిగడ్డల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ (Sharad Pawar) డిమాండ్ చేశారు. రైతు కష్టాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా చంద్వాడ్ గ్రామానికి చెందిన ఉల్లి రైతులు చేపట్టిన నిరసనలో పవార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రైతులంతా ఏకమై హక్కులను సాధించుకోవాలని సూచించారు. ఉల్లి రైతులు పంట కోసం ఆరుగాలం శ్రమించే చిన్న రైతులని, వారికి నష్టం జరిగే పనులను కేంద్రం మానుకోవాలని ఆయన హితవుపలికారు. తాను కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలో పెరిగిన ఉల్లి ధరలను తగ్గించడం గానీ, ఎగుమతులపై నిషేధం విధించడం గానీ చేయలేదని గుర్తుచేశారు.
ఉల్లి ఎగమతులపై నిషేధాన్ని కేంద్రం తక్షణమే వెనక్కు తీసుకోవాలని పవార్ కోరారు. ద్రాక్షపై రూ.160 మేర బంగ్లాదేశ్ దిగుమతి సుంకం విధించిందని, దాంతో ద్రాక్ష రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. కాగా, దేశీయంగా లభ్యతను పెంచడంతో పాటు ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రలోని పలుచోట్ల ఉల్లి రైతులు నిరసనలకు దిగుతున్నారు.