ముంబై: తన రాజీనామాను వెనక్కు తీసుకొంటున్నట్టు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శుక్రవారం ప్రకటించారు. దీంతో ఎన్సీపీ అధ్యక్ష పదవికి పవార్ రాజీనామా తర్వాత గత మూడు రోజులుగా చోటుచేసుకొంటున్న నాటకీయ పరిణామాలకు తెరపడింది. ప్రజలు, పార్టీ కార్యకర్తలు, తన సహచరుల ప్రేమ, నమ్మకం, మనోభావాలను గౌరవిస్తూ రాజీనామాను ఉపసంహరించుకోవాలన్న అభ్యర్థనను అంగీకరిస్తున్నానని పవార్ మీడియాతో పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో పార్టీలో ఏ పోస్టు లేదా ఏ బాధ్యత విషయంలోనైనా వారసత్వం ఎవరికి అప్పగించాలనే విషయంలో ఒక ప్రణాళిక ఉండాల్సిన అవసరం ఉన్నదని పవార్ పేర్కొన్నారు. పవార్ రాజీనామా వెనక్కు తీసుకోవడంతో ఎన్సీపీ శ్రేణులు సంబురాలు చేసుకొన్నాయి.
పవార్ రాజీనామాను తిరస్కరిస్తూ, పార్టీ అధ్యక్షుడిగా ఆయనే కొనసాగాలని అభ్యర్థిస్తూ ఎన్సీపీ కమిటీ తీర్మానం చేసిన కొద్ది గంటలకే పవార్ రాజీనామాను విత్డ్రా చేసుకోవడం గమనార్హం. కమిటీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని పవార్ చెప్పారు. ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాలని పార్టీ నేతలు చేసిన సూచనను తన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే తిరస్కరించారని తెలిపారు. రాబోవు రోజుల్లో పార్టీలో కొత్త బాధ్యతలు అప్పగించడం, కొత్త నాయకత్వాన్ని తయారు చేయడం వంటి సంస్థాగత మార్పులపై దృష్టి పెడుతానని పవార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్సీపీ అభివృద్ధికి, పార్టీ సిద్ధాంతం, లక్ష్యాలను ప్రజలకు చేరువ చేసేందుకు నూతనోత్సాహంతో కృషి చేస్తానన్నారు.
అయితే పవార్ ఈనెల 2న రాజీనామా చేసిన సమయంలో, ఆ నిర్ణయాన్ని సమర్థించిన అజిత్ పవార్.. తాజాగా రాజీనామా ఉపసంహరణ ప్రకటన సమయంలో కనిపించకపోవడం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మీడియా సమావేశానికి అజిత్ రాకపోవడంపై అడిగిన ప్రశ్నకు శరద్ పవార్ స్పందిస్తూ.. అజిత్ గైర్హాజరుపై ఎక్కువగా ఆలోచనలు చేయవద్దని, ‘అందరూ అన్నిచోట్ల ఉండరు’ అంటూ సమాధానం ఇచ్చారు. ‘ఇతరులు ఇక్కడ ఉన్నారు. కమిటీ నిర్ణయం తర్వాత నా రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకొన్నాను. అందరూ ఐక్యంగా కమిటీలో చర్చించారు. కమిటీలో సీనియర్ నేతలు ఉన్నారు’ అని పేర్కొన్నారు. కాగా, రాజీనామా అంశంపై పవార్ తనతో అంతకుముందు మాట్లాడిన విషయం వాస్తవమేనని, అయితే శరద్ పవార్ తన రాజీనామాను వెనక్కు తీసుకోవడంలో తనకేమీ కోపం లేదని అజిత్ పవార్ ఓ మీడియా సంస్థ ప్రతినిధికి ఫోన్లో తెలిపారు.