ముంబై : క్రూయిజ్ డ్రగ్ కేసుకు సంబంధించి ఇతర నిందితుల తరహాలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ హస్తం కూడా ఉందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) స్పష్టం చేసింది. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్పై ఎన్సీబీ బదులిస్తూ ఈ మేరకు కోర్టుకు పేర్కొంది.
నిందితుడు కుట్రలో పాలుపంచుకున్నాడని తెలిపింది. ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్లో రేవ్ పార్టీపై ఎన్సీబీ అధికారులు జరిపిన దాడుల్లో ఆర్యన్ ఖాన్ సహా పలువురు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆర్యన్ బెయిల్ పిటిషన్కు వ్యతిరేకంగా ప్రత్యేక కోర్ఠులో ఎన్సీబీ వాదనలు వినిపించనుంది. ఈ కేసులో ఇప్పటివరకూ దాదాపు 20 మంది నిందితులను ఎన్సీబీ అరెస్ట్ చేసింది. గత వారం ఆర్యన్ను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించగా ఆయన బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించాడు.