Pakistan | పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కొన్ని రోజుల్లోనే స్వదేశానికి తిరిగిరానున్నట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాల రీత్యా నవాజ్ షరీఫ్ ప్రస్తుతం లండన్లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడ్డ తర్వాతే పాకిస్తాన్కు తిరిగి వస్తారని ఆయన తమ్ముడు షబాజ్ షరీఫ్ మొదట్లో ప్రకటించారు. అయితే యూకే ప్రభుత్వం ఆయన వీసా పొడిగింపుకు ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. ఈ కారణాల రీత్యానే షరీఫ్ అతి తొందరగానే తిరిగి పాకిస్తాన్కు వచ్చేయనున్నట్లు సమాచారం.
మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన ఓ వ్యక్తి ఆరోగ్య విషయంలో ఇమ్రాన్ సర్కార్ రాజకీయాలు చేయడం, ఈ విషయాన్ని తమ రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు షబాజ్ షరీఫ్. మరోవైపు నవాజ్ షరీఫ్ పాకిస్తాన్కు తిరిగి వస్తే, రాజకీయ ముఖచిత్రం మారే సూచనలు కనిపిస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇమ్రాన్ ప్రభుత్వానికి, షరీఫ్కు మధ్య రాజకీయ విమర్శలు పెరుగుతాయని, వాతావరణం గంభీరంగా మారిపోయే ఛాన్స్ ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.