వివిధ దేశాల నౌకలను హైజాక్ చేస్తూ చెలరేగుతున్న సముద్రపు దొంగల భరతం పడుతున్నది భారత నేవీ. మన నావికాదళానికి చెందిన మార్కస్ కమాండోల పేరు వింటేనే పైరేట్లు హడలిపోతున్నారు. మూడురోజులుగా అరేబియన్ సముద్రంలో వీరోచిత ఆపరేషన్ను నిర్వహిస్తున్న మన నావికాదళం.. హైజాక్కు గురైన మూడు నౌకలను కాపాడింది. 19మంది పాకిస్థాన్, 17మంది ఇరాన్ సిబ్బందిని కాపాడింది.
Indian Navy | న్యూఢిల్లీ, జనవరి 30: సముద్రపు దొంగల గుండెల్లో ఇండియన్ నేవీ రైళ్లు పరిగెత్తిస్తున్నది. అరేబియా సముద్రంలో తరచూ నౌకలను హైజాక్ చేస్తున్న పైరేట్ల ఆటకట్టిస్తున్నది. ఇండియన్ నేవీ అంటేనే వారు హడలెత్తిపోతున్నారు. గత మూడు రోజుల వ్యవధిలో హైజాక్కు గురైన వివిధ దేశాలకు చెందిన మూడు నౌకలను భారత నావికాదళం కాపాడింది. 19 మంది పాకిస్థాన్, 17 మంది ఇరాన్ సిబ్బందిని మన మార్కోస్ కమెండోలు తమ వీరోచిత ఆపరేషన్తో రక్షించారు. అలాగే శ్రీలంక మొగదీసు తూర్పు తీరంలో హైజాక్ అయిన చేపల నౌకను మన నేవీ సిబ్బంది, శ్రీలంక సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో స్వాధీనం చేసుకున్నారు.
డేరింగ్ ఆపరేషన్..
ఇరాన్ జెండాతో వస్తున్న ఒక చేపల నౌకను సముద్రపు దొంగల నుంచి ఇండియన్ నేవీ సోమవారం రక్షించింది. సోమాలియా తూర్పుతీరంలో ఈ బోటుపై సోమవారం 11 మంది సాయుధులైన సోమాలియా సముద్రపు దొంగలు దాడి చేశారు. ఎడెన్ గల్ఫ్, తూర్పు సోమాలియా సముద్ర జలాల్లో ఉన్న మన యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్రాకు ఈ సమాచారం అందడంతో హుటాహుటిన చేపలు పట్టే నౌక ఆల్ నయీమీ వద్దకు చేరుకుని హెలికాప్టర్ సాయంతో సముద్రపు దొంగలను తరిమికొట్టి అందులోని 19 మంది పాకిస్థాన్ సిబ్బందిని రక్షించింది.
అలాగే ఆదివారం ఎఫ్వీ ఇమాన్ అనే ఇరాన్ నౌకపై సముద్రపు దొంగలు దాడి చేయగా వెంటనే స్పందించి సముద్రపు దొంగల ఆట కట్టించి 17 మంది ఇరాన్ సిబ్బందిని కాపాడింది. అలాగే తూర్పు మొగాదిషులో శ్రీలంక నౌకను శనివారం ముగ్గురు పైరేట్లు హైజాక్ చేయగా భారత్ నేవీ రంగంలోకి దిగింది. శ్రీలంక నేవీతో కలిసి సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి నౌకను విడిపించింది. గత 36 గంటల్లో అరేబియా సముద్రంలో మొత్తం 36 మంది సిబ్బందిని భారత నేవీ రక్షించింది.
ఏమిటీ మార్కోస్ దళం?
మార్కోస్.. ఈ పేరెత్తితే చాలు.. సముద్రపు దొంగలు హడలెత్తిపోతారు. భారత్లోని అతి శక్తివంతమైన ఎనిమిది కమాండో దళాల్లో మార్కోస్ ఒకటి. 1987లో ఏర్పాటైన ఈ దళంలో సుశిక్షితులైన సిబ్బంది ఉంటారు. యూఎస్ నేవీ సీల్స్ మాదిరిగా రూపొందిన వీరు వివిధ రంగాల్లో అత్యున్నత శిక్షణ పొందడంతో పాటు అన్ని రకాలు అడ్వాన్స్డ్ ఆయుధాల ప్రయోగంలో ఆరితేరారు. మిగతా దళాలకు, దీనికి తేడా ఏమిటంటే ప్రతికూల వాతావరణం, పరిస్థితులను సైతం సమర్థంగా ఎదుర్కొంటారు.
నీరు, నేల, నింగి ఇలా ఏ వైపు నుంచి వచ్చే విపత్తులైనా ఎదుర్కొనే సత్తా వీరి సొంతం. అవసరమైనప్పుడు భారత ఆర్మీతో సమన్వయం చేసుకుంటూ సునిశిత ప్రదేశాలలో వారితో కలిసి సంయుక్త ఆపరేషన్లు చేపడతారు. భయమంటే ఏమిటో తెలియని ధీరులుగా వీరిని అభివర్ణిస్తారు. తుఫాన్ లాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కూడా వీరి సేవలను వినియోగిస్తారు. అలాగే 26/11 ముంబై ఉగ్రదాడిలో, శ్రీలంకలో ఎల్టీటీఈ తీవ్రవాదుల అణచివేతలో కూడా వీరు తమ సేవలందించారు.