ముంబై : హనుమాన్ చాలీసా వివాదంలో ఇటీవల జైలు నుంచి విడుదలైన ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త రవికి మరోసారి కష్టాలు తప్పేలా లేవు. నవనీత్ దంపతులకు మంజూరైన బెయిల్ను సవాల్ చేసే విషయంపై మహారాష్ట్ర సర్కారు యోచిస్తున్నది. హనుమాన్ చాలీసా వివాదంలో ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చిన అనంతరం ఆసుపత్రిలో చేరిన ఆమె.. ఆదివారం డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా నవనీత్ రాణా శివసేన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శివసేనపై పోరాటం కొనసాగిస్తానని చెప్పారు.
రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచైనా సరే తనపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని, మహిళా శక్తి అంటే ఏంటో ఉద్ధవ్ ఠాక్రేకు చూపిస్తానన్నారు. తాను ఏ తప్పు చేశానని జైళ్లో పెట్టారని ఆమె ప్రశ్నించారు. హనుమాన్ చాలీసా చదవడం తప్పా అంటూ నిలదీశారు. హనుమాన్ చాలీసా చదవడమే నేరమైతే 14 రోజులు కాదు 14 ఏళ్లు జైల్లో ఉంటాను అంటూ ఠాక్రేపై తీవ్ర విమర్శలు చేశారు. నవనీత్ కౌర్ రెండు వారాల క్రితం థాకరే నివాసం మాతో శ్రీ ముందు హనుమాన్ చాలీసా చదివేందుకు యత్నించారనే ఆరోపణలతో నవ్నీత్, ఆమె భర్త రవి రానాను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నవనీత్ రాణా దంపతులు ఉద్దేశపూర్వకంగా ఇరు వర్గాల మధ్య శత్రుత్వాన్ని సృష్టిచేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ పోలీసులు అరెస్టు చేశారు.
ఐపీసీ, ముంబై పోలీస్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఖర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 12 రోజుల వరకూ వారికి బెయిల్ రాలేదు. ఇటీవల బెయిల్పై విడుదలగా ఆ తర్వాత.. ఛాతి నొప్పి, హై బీపీతో బాధపడుతూ నవనీత్ ఆసుపత్రిలో చేరారు. ఇదిలా ఉండగా.. రాణా దంపతులకు బెయిల్ మంజూరు చేసిన సమయంలో సెషన్స్ కోర్టు పలు షరతులు విధించింది. ముఖ్యంగా మీడియాతో మాట్లాడకూడదనేది షరతుల్లో ఒకటి. అయితే, నవనీత్ రాణా మీడియాతో మాట్లాడడంతో పాటు సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు సవాల్ విసరడంతో ప్రభుత్వం బెయిల్ను సవాల్ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది.