చండీఘఢ్ : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్పై శనివారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తానీ జర్నలిస్ట్ అరూస ఆలంతో కెప్టెన్ దోస్తీపై కాంగ్రెస్ నేతల విమర్శల నేపధ్యంలో సిద్ధూ భార్య సైతం ఆయనపై ఆరోపణలు గుప్పించారు. అరూస ఆలం కెప్టెన్ సింగ్తో సన్నిహితంగా మెలిగేవారని, ఆమె కుమారుడు రోషన్ కనుసన్నలతో ఎస్హెచ్ఓలు, ఎస్పీల పోస్టింగ్లు సాగేవని వ్యాఖ్యానించారు.
కెప్టెన్ సింగ్ సర్కార్ హయాంలో అరూస ఆలం పంజాబ్ డీజీపీలా వ్యవహరించేవారని ఆమె ఆరోపించారు. కెప్టెన్ కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాలను ప్రస్తావిస్తూ ఈ వయసులో కెప్టెన్ సాబ్ ప్రార్ధనలు చేసుకుంటూ అరూస ఆలంతో సంతోషంగా సమయం గడపాలని ఆమె చురకలు అంటించారు. కెప్టెన్ పాలనలో వివక్ష కొనసాగగా ప్రస్తుతం పంజాబ్లో అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయని నవజోత్ కౌర్ పేర్కొన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూ అమృత్సర్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తారని ఆమె వెల్లడించారు.