పటియాలా: పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) నేడు పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. 1988 నాటి ర్యాష్ డ్రైవింగ్ కేసులో సుప్రీంకోర్టు సిద్ధూకి ఏడాది పాటు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన పటియాలా పోలీసులకు లొంగిపోయే అవకాశం ఉన్నది. కోర్టు తీర్పును గౌరవిస్తానని, పోలీసులకు లొంగిపోతానని సూచనప్రాయంగా ప్రకటించిన ఆయన అమృసర్ నుంచి పటియాలా లోని ఇంటికి చేరుకున్నారు.
కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇంకా తమకు అందలేదని, శుక్రవారం ఉదయం ఛండీగఢ్ కోర్టు నుంచి పటియాలా పోలీస్స్టేషన్కు వస్తాయని అధికారులు తెలిపారు. అనంతరం సమన్లను సిద్ధూకి అందించి లొంగిపోవాలని కోరుతామన్నారు. అరెస్టు చేసిన వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక దవాఖానకు తరలిస్తామని చెప్పారు.
Will submit to the majesty of law ….
— Navjot Singh Sidhu (@sherryontopp) May 19, 2022
సిద్ధూపై 1988 నాటి ర్యాష్ డ్రైవింగ్ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్, జస్టిస్ ఎస్కే కౌల్తో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో బాధితుడైన 65 ఏండ్ల వృద్ధుడిని సిద్ధూ ఉద్దేశపూర్వకంగానే గాయపరిచినట్టు 2018లో సుప్రీంకోర్టు నిర్ధారిస్తూ రూ.వెయ్యి జరిమానా విధించి వదిలేసింది. అయితే జరిమానా మాత్రమే విధించడం సరికాదంటూ బాధితుడి కుటుంబసభ్యులు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
1988 డిసెంబర్ 27న సిద్ధూ, ఆయన స్నేహితుడు రూపిందర్ సంధూ పటియాలాలోని షేరాన్వాలా గేట్ వద్ద రోడ్డు మధ్యలో తమ జిప్సీని పార్కు చేశారు. 65 ఏండ్ల గుర్నాం సింగ్ బ్యాంకుకు వెళ్తుండగా, రోడ్డు మధ్యలో ఉన్న జిప్సీని తీయాలని కోరారు. దీంతో సిద్ధూ, సంధూ, గుర్నాం సింగ్కు మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన సిద్ధూ.. గుర్నాం సింగ్ను తలపై కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన గుర్నాం సింగ్ను దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.