ముంబై : మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా వివాదం కొనసాగుతున్నది. స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా దంపతులు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిషాత్ను కలిసి మహారాష్ట్ర అధికారులపై ఫిర్యాదు చేయనున్నారు. సోమవారం ముంబైలో నవనీత్ రాణా దంపతులు విలేకరులతో మాట్లాడారు. తాము కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టం చేశారు. బీజేపీని వెన్నుపోటు పొడిచిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే మాకు నిబంధనలను గురించి చెప్పొద్దన్నారు.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసం మాతోశ్రీ ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ చేసిన ప్రకటనపై ముంబై పోలీసులు రాణా దంపతులను ఏప్రిల్ 23న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మే 4న ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది. మీడియాతో మాట్లాడొద్దని స్పష్టం చేసింది. 5న జైలు నుంచి విడుదలవగా.. ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. నిన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ను చిలుకగా అభివర్ణించిన నవనీత్ రాణా.. మమ్మల్ని సమాధి చేసేలా మాట్లాడారని ఆరోపించారు.
దీనిపై ముంబైలో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందుకే ఈ అంశాన్ని లేవనెత్తేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. నవనీత్ రాణా బెయిల్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముంబై పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ప్రత్యేక కోర్టులో పోలీసులు దరఖాస్తు చేశారు. రాణా దంపతులు బెయిల్ షరతులను ఉల్లంఘించారని, బెయిల్ను రద్దు చేయాలని కోరారు. మీడియాతో మాట్లాడకూడదనే షరతును ఉల్లంఘించారని కోర్టుకు తెలిపారు.