చండీగఢ్: వందో ఏట అడుగుపెట్టిన మాజీ నేవీ అధికారికి అరుదైన సత్కారం లభించింది. వందో పుట్టిన రోజు నేపథ్యంలో ఇండియన్ నేవీ ఆయనను ఘనంగా సన్మానించింది. హర్యానాకు చెందిన సర్దార్ సుజన్ సింగ్, భారత నౌకాదళంలో పని చేసి రిటైర్ అయ్యారు. కాగా, గురువారం ఆయన వందో ఏటా ప్రవేశించారు. ఈ నేపథ్యంలో నేవీ సిబ్బంది కర్నాల్లో ఘనంగా ఆయన వందో పుట్టిన రోజు వేడుకను జరిపారు. చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ తరపున ప్రశంసా పత్రం, సీఎన్ఎస్ క్రెస్ట్, మెమెంటో, ‘ప్రౌడ్ నేవల్ వెటరన్’ క్యాప్ను అందజేశారు. మాజీ నౌకాదళ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరోవైపు, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ కూడా స్వయంగా సర్దార్ సుజన్ సింగ్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆయనతో నేరుగా వీడియో కాల్లో మాట్లాడారు. సింగ్ ఆరోగ్యం, యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. మంచి ఆరోగ్యంతో మరిన్ని ఏండ్లు జీవించాలని ఆకాంక్షించారు.