ముంబై: వ్యక్తిగత సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి ఆడవాళ్లను మోసం చేస్తున్న రిటైర్డ్ మర్చెంట్ నేవీ ఆఫీసర్ను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అశోక్ ఖారత్(Ashok Kharat)గా గుర్తించారు. అతనో జ్యోతిష్యుడు కూడా. ఓ 35 ఏళ్ల మహిళను లైంగికంగా వేధించిన కేసులో అతను పోలీసులకు చిక్కాడు. ఆధ్యాత్మికత పేరుతో అతను తన అకృత్యాలను కొనసాగించాడు. వివరాల్లోకి వెళ్తే.. అశోక్ ఖారత్ వయసు 67 ఏళ్లు. పూజలు చేస్తానని చెప్పి 35 ఏళ్ల మహిళను వశపరుచుకున్నాడు. ఆమెకు మత్తు మందును ఇచ్చి.. హిప్నటైజ్ చేశాడు. ఆ తర్వాత శారీరకంగా ఆమెపై దాడి చేశాడు. మూడేళ్లుగా వేదన అనుభవించిన ఆ మహిళ చివరకు పోలీసుల్ని ఆశ్రయించింది. కేసును చేధించిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యింది. కేవలం ఒక్క మహిళే కాదు.. ఆ ఆస్ట్రాలజర్ ఉచ్చులో అనేక మంది మహిళలు బలైనట్లు గుర్తించారు.
పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఖారత్ను రిటైర్డ్ మెర్చంట్ నేవీ ఆఫీసర్గా గుర్తించారు. అతన్ని కెప్టెన్గా కూడా పిలుస్తారు. పర్సనల్ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి ఆడవాళ్లను తన ఆఫీసుకు రావాలని పిలిచేవాడు. అక్కడకు వెళ్లిన మహిళలను హిప్నటైజ్ చేసేవాడు. మత్తు ఇచ్చి ఆ పని చేసేవాడని పోలీసులు చెప్పారు. ఆ మహిళలను భయపెట్టి వారిని రేప్ చేసేవాడని తెలిసింది. భర్తలను చంపేస్తానని లేదంటే.. చేతబడి పూజలతో వణుకు పుట్టించేవాడు. ఫార్మౌజ్ వేదికగా ఈ అకృత్యాలకు పాల్పడ్డాడు. అయితే అతని ఆఫీసులో సీసీకెమెరాలను ఇన్స్టాల్ చేశాడు. ఆఫీసు నుంచి ఓ పెన్డ్రైవ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో చాలా మంది మహిళలతో శృంగారం చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. సుమారు 58 మంది మహిళలతో అసభ్యకరంగా ఉన్న వీడియో క్లిప్లను గుర్తించారు.
ఈ కేసును పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఐపీఎస్ ఆఫీసర్ తేజస్విని సత్పుతే నేతృత్వంలో ఆ బృందం దర్యాప్తు చేపట్టింది. నిందితుడు అశోక్ ఖారత్ నుంచి సేకరించిన ఫోరెన్సిక్ ఆధారాలను నాసిక్ క్రైం బ్రాంచ్ పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. నాసిక్లోని కెనడా కార్నర్ ప్రాంతంలో నిందితుడు ఓ ఆఫీసును మెయిన్టేన్ చేశాడు. రియల్ ఎస్టేట్ డెవలపర్ బోర్డు పెట్టుకుని అతను నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక ప్రజల్లో అతనికి ఓ గొప్ప జ్యోతిష్కుడిగా పేరున్నది. అతనికి రాజకీయ రిలేషన్లు కూడా ఉన్నాయి. ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్నట్లు భావిస్తున్నారు. మిర్గావ్ ప్రాంతంలో ఈషానేశ్వర్ ఆలయం అతని పేరుమీద ఉన్నది. అక్కడ జరిగే కార్యక్రమాలకు పెద్ద పెద్ద వ్యక్తులు వస్తుంటారు.
నాసిక్ ఫార్మౌజ్లో ఉన్న అశోక్ను అరెస్టు చేసేందుకు పోలీసులు పక్కా ప్లాన్ చేశారు. చాలా సీక్రెట్గా కోవర్ట్ ఆపరేషన్ చేపట్టారు. నిందితుడు ఇంటి ముందు డ్రామా ఆడి.. ఇంట్లోకి ప్రవేశించారు. అతని బెడ్రూమ్లోనే అతన్ని అరెస్టు చేశారు. రెయిడ్ సమయంలో ఓ పిస్తోల్, లైవ్ కాట్రిడ్జ్లును స్వాధీనం చేసుకున్నారు. అతనికి చెందిన ఆలయంలో కూడా సోదాలు చేపట్టారు. అనేక అనుమానాస్పద డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో అతనికి చాలా రకాల ప్రాపర్టీలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో రాజకీయ కోణం కూడా ఉన్నది. జ్యోతిష్కుడు కావడం వల్ల అతని వద్దకు అనేక మంది రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు వెళ్లినట్లు తెలుస్తోంది.