న్యూఢిల్లీ: నాసాకు చెందిన లూనార్ రికన్నైసెన్స్ ఆర్బిటార్(ఎల్ఆర్వో)లో ఉన్న ఓ లేజర్ పరికరం.. చంద్రుడిపై ఉన్న చంద్రయాన్-3కి చెందిన విక్రమ్ ల్యాండర్ను పింగ్ చేసింది. ఎల్ఆర్వో, విక్రమ్ ల్యాండర్ మధ్య లేజర్ బీమ్ ట్రాన్స్మిట్ అయినట్లు నాసా వెల్లడించింది. చంద్రుడి దక్షిణ ద్రువంలోని మంజినస్ క్రాటర్లో ఉన్న విక్రమ్ ల్యాండర్ నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఎల్ఆర్వో ఉంది. గత ఏడాది డిసెంబర్ 12వ తేదీన ఎల్ఆర్వో సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. కదులుతున్న స్పేస్క్రాఫ్ట్ నుంచి స్థిరంగా ఉన్న ల్యాండ్పై లేజర్ కిరణాలను పంపడం కీలకమైందన్నారు. ల్యాండర్లో ఉన్న లేజర్ రిట్రోరిఫ్లెక్టార్(Laser Retroreflector) నుంచి సంకేతాలు మళ్లీ అందినట్లు గోడార్డ్ స్పేస్ ఫ్లయిట్ సెంటర్ శాస్త్రవేత్త జియోలి సన్ తెలిపారు. నాసా, ఇస్రో భాగస్వామ్యంలో రిట్రోరిఫ్లెక్టార్ను డెవలప్ చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయోగాలకు ఇదే తరహా టెక్నిక్ వాడాలని భావిస్తున్నట్లు సన్ తెలిపారు. రిట్రోరిఫ్లెక్టార్ ద్వారా భూమి మీదకు చంద్రుడి నుంచి సిగ్నల్ అందుతుందని, అయితే ఆ డేటా ఆధారంగా చంద్రుడు భూమి నుంచి ప్రతి ఏడాది 3.8 సెంటీమీటర్లు దూరం అవుతున్నాడని తెలుస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు.