(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ‘నర్మదా మాత పరుగులతో గుజరాత్లోని రాయన్ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. నర్మదా కెనాల్ అద్భుత నిర్మాణం’ అంటూ ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఆ వెంటనే ఈ కెనాల్ నిర్మాణం బీజేపీ ప్రభుత్వానికే సాధ్యమైందంటూ ఆ పార్టీ నేతలు ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో దీన్ని పోల్చారు. అయితే, వాటర్ లీకేజీతో కెనాల్ అసలు నాణ్యతా ప్రమాణాలు తాజాగా బయటపడ్డాయి.
ఊడుతున్న కాంక్రీట్ పెచ్చులు
దేశంలోనే రెండో అతి పొడవైన కెనాల్గా నర్మదా కాలువను గుజరాత్లో నిర్మించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గతనెలలో దీన్ని ప్రారంభించారు. అయితే, కాలువ నిర్మాణం నాసిరకంగా ఉండటంతో సగటున ప్రతీ 60-70 మీటర్లకు ఒక చోట రంధ్రాలు పడి నీటి లీకేజీ జరుగుతున్నది. మరికొన్ని చోట్ల కాలువ గట్టు గోడల నుంచి ఏకంగా కాంక్రీటు పెచ్చులుగా ఊడిపడుతుండటం గమనార్హం. లీకేజీతో రాయన్, కెడువా, బిర్దా తదితర గ్రామాల్లోని పొలాలకు గత కొన్ని రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ మేరకు న్యూస్ వెబ్సైట్ ‘న్యూస్ క్లిక్’ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే, నిర్మాణంలో ఎలాంటి పొరపాట్లు జరుగలేదని ఓ కాంట్రాక్టర్ పేర్కొన్నారు. రెండేండ్ల వ్యవధిలో కనీసం 207 చోట్ల నర్మదా కాలువ గట్లు తెగిపోయినట్టు గుజరాత్ ప్రభుత్వమే అసెంబ్లీలో తెలిపింది.