‘ఈ దేశంలో ఓట్ల కోసం మిఠాయిలు (రేవడీ) పంచిపెట్టే సంస్కృతి బాగా ప్రబలిపోయింది. ఇలాంటి ఉచితాలు ఇచ్చే రేవడీ సంస్కృతిని యువత అడ్డుకోవాలి. ఇది దేశాభివృద్ధికి చాలా ప్రమాదకరం.’
జూలై 16, 2022 న ఉత్తర ప్రదేశ్లో 296 కిలోమీటర్ల పొడవైన బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్య.
ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఉచిత పథకాల హామీలు ఇవ్వకుండా నియంత్రించేలా సీఈసీని ఆదేశించాలి.
ఆగస్టు 3, 2022న ఉచితాలను నిషేధించాలంటూ తాను గతంలో వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో చేసిన వాదన.
ఉచితాలు టైం బాంబు లాంటివి. వాటికి కళ్లెం వేయాల్సిన అవసరం ఉన్నది. ఉచితాల ఖర్చు రాష్ర్టాల జీఎస్డీపీలో 1% మించరాదు.
అక్టోబర్ 3, 2022న స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలి నివేదికలోని అంశం..
అన్ని పార్టీలు.. ఎన్నికల హామీలకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలి. వాటిని ఎలా నెరవేరుస్తారు? ఆర్థిక వనరుల విషయమై ఓటర్లకు ప్రామాణిక మైన సమాచారం ఇవ్వాలి. ఊరికే ఇచ్చే ఎన్నికల హామీలు తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. ఎన్నికల హామీల అమలు తీరును చెప్పకపోవడం పర్యవసానంగా ఆర్థిక స్థిరత్వంపై పడే అవాంఛనీయ ప్రభావాన్ని విస్మరించలేము. రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలో ఇచ్చే హామీలను నెరవేర్చేందుకు ఆర్థిక పరమైన సాధ్యాసాధ్యాలు ఉన్నాయా? కేంద్ర, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు తగినట్టుగా ఉన్నాయా? లేదా అన్నది ఓటర్లకు తెలియజేయాలి. ఆదాయ మార్గాల వివరాలు, వ్యయ హేతుబద్ధీకరణ, అప్పులపై ప్రభావం.. తద్వారా ఎఫ్ఆర్బీఎం పరిమితులపై ప్రభావం వంటి వివరాలు చెప్పాలి.
అక్టోబర్ 4, 2022న ఎన్నికల మ్యానిఫెస్టోపై మార్గదర్శకాలకు సంబంధించి ఎన్నికల నియమావళిలో పార్ట్ 8కి సవరణ ప్రతిపాదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకు రాసిన లేఖలోని సారాంశం.
ఉచితాలపై గత 4 మాసాలుగా దేశవ్యాప్తంగా చోటు చేసుకొన్న పరిణామాలివి. ఈ క్రమాన్ని గమనిస్తే దీని వెనుక నడిపిస్తున్న సూత్రధారులు ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తాము అధికారంలోకి రావడానికి ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పించిన ప్రధాని.. ఉచితాలు వద్దంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. బీజేపీ నేత ఉచితాలు నిషేధించాలని కేసు వేస్తారు. ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలను సక్రమంగా నిర్వహించాల్సిన ప్రభుత్వ రంగ బ్యాంకు రాజకీయ పార్టీలు ఏ విధంగా నడుచుకోవాలో చెప్తుంది. ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం.. నియమావళి పేరుతో శాసన వ్యవస్థలో జోక్యం చేసుకుంటానంటుంది. కేంద్రం, రాష్ర్టాల ప్రభుత్వాలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు.. అప్పులు.. చివరకు ఎఫ్ఆర్బీఎం విషయంలో కూడా తమకు ముందే చెప్పాలని.. పార్టీలను శాసించాలని చూస్తుంది.
ఎన్నికల సంఘం అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ. దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం దాని బాధ్యత. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యక్తిత్వం.. ఆస్తిపాస్తులకు సంబంధించిన వివరాలు తెలుసుకొని.. వారి సచ్ఛీలత ఆధారంగా పోటీకి అనుమతించడం దాని కర్తవ్యం. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో సవరణ చేయడం ద్వారా.. ఎన్నికలకు ముందే.. కేంద్ర, రాష్ర్టాల ఆర్థిక వ్యవహారాలను బహిర్గత పరచాలని కోరుతున్నది. ఎన్నికల సంఘం కోరితే పార్టీలు ఏ సమాచారాన్నైనా ఇవ్వాల్సిందే. కానీ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి 1990ల నుంచి అమలులోకి వచ్చింది కదా.. అంతకుముందు నుంచీ.. రాజకీయ పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోలను విడుదల చేస్తూనే ఉన్నాయి కదా.. నియమావళి విషయంలో కానీ.. ఆస్తిపాస్తులు, నేర చరిత్ర, ఎన్నికల వ్యయానికి సంబంధించి అన్ని వివరాలు తీసుకొంటున్న ఎన్నికల సంఘానికి ఎన్నికల మ్యానిఫెస్టో అమలు గురించి అకస్మాత్తుగా ఎందుకు గుర్తొచ్చినట్టు? ఎన్నికల మ్యానిఫెస్టో రూపకల్పన.. ఎలాంటి హామీలు ఏ తరహాలో ఉండాలో.. ప్రవర్తనా నియమావళి పార్ట్ 8 లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడు ఇందులో కేంద్రాలు.. రాష్ర్టాల ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన నియమం చేర్చాలనడం వెనుక మతలబు ఏమిటి? ఇప్పుడు హామీలు ఎలా చేస్తారని పార్టీలను అడుగుతున్న కేంద్ర ఎన్నికల సంఘం.. కేంద్రంలో, రాష్ర్టాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు తాము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలుచేశారని ఎందుకు అడగటంలేదు? హామీలు అమలు చేయకపోతే.. ఆ పార్టీలపై, నాయకులపై చర్యలు తీసుకోగలదా? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 2014, 2019లో చేసిన హామీల్లో 40కిపైగా అమలుకు నోచుకోలేదు. కనీసం ప్రాథమిక దశలో కూడా అడుగు కదపని హామీలు ఎన్నో ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీని ఈ పథకాలు ఎందుకు అమలు చేయలేదని నోటీసులు ఇవ్వగలదా?
ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి.. ఒకదాని వెంట ఒకటిగా 40 కిపైగా హామీలు ఇచ్చారు. వీటిలో ఏ ఒక్కటీ పూర్తిగా అమలుకాలేదు. సాక్షాత్తూ నీతి ఆయోగ్ ప్రచురించిన ‘స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా -75’ రిపోర్టులోని ఏ హామీ నెరవేరలేదు. 2014 ఎన్నికల్లో ‘అచ్చేదిన్’ నినాదమిచ్చిన ఆయన ఐదేండ్లు తిరిగేనాటికి దాన్ని పక్కనబెట్టేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ‘న్యూ ఇండియా-2022’ అంటూ మరో నినాదాన్ని ఎత్తుకొన్నారు. 2021 వచ్చేనాటికి దాన్నీ వదిలేసి ‘2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక’ వ్యవస్థ అంటూ మొదలుపెట్టారు. ఇప్పుడు 2047 నాటికి పంచ ప్రాణాల ఆవిష్కరణ అంటూ వజ్రోత్సవ సంబురాల్లో కొత్త ప్రకటన చేశారు. ప్రతి హామీ ఒక నినాదమే. గాల్లో కలిసిపోవాల్సిందే.
(స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ)
హామీ-1: రైతుల ఆదాయం రెట్టింపు. 2015-16లో మోదీ హామీ ఇచ్చిన్నాటికి ఒక్కో రైతు సగటు ఆదాయం నెలకు రూ.8,059గా ఉండేది. ద్రవ్యోల్బణం బట్టి రైతుకు నెల ఆదాయం ప్రస్తుతం రూ.21,146 గా ఉండాలి. కానీ 77వ నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం.. సగటున రూ.10,218 కంటే తక్కువగా ఉన్నది. ఆదాయంకంటే ఖర్చు రెట్టింపు అయింది.
హామీ-2: ప్రతి భారతీయుడికి బ్యాంకు ఖాతా, జీవిత, ప్రమాద బీమా, పెన్షన్, రిటైర్మెంట్ ప్లానింగ్ సర్వీసెస్. దేశంలో బ్యాంకు ఖాతా లేని వాళ్లు 21 కోట్లు. ప్రతి వంద మందిలో ముగ్గురికే జీవిత బీమా పాలసీ ఉన్నది. 35% మందికి ప్రమాద బీమా లేదు. 40 కోట్ల మంది పెన్షన్, రిటైర్మెంట్ ప్లానింగ్ సర్వీసెస్ పరిధిలో లేరు.
హామీ-3: ‘హర్ ఖేత్ కో పానీ’ 2015లో ప్రకటించిన ‘హర్ ఖేత్ కో పానీ’ స్కీమ్ ఏమైందో తెలియదు.
హామీ-4: ప్రతి ఇంటికి వంటగ్యాస్. 21 కోట్ల మంది గ్యాస్ సిలిండర్కు దూరంగా ఉన్నారన్నమాట. 2014లో గ్యాస్ ధర రూ.410 ఉంటే ఇప్పుడు రూ.1,105గా ఉన్నది. 5 లక్షల మంది గ్యాస్ కనెక్షన్లు వదులుకొన్నారు.
హామీ-5: 24/7 విద్యుత్తు సౌకర్యం. నీతిఆయోగ్, స్మార్ట్ పవర్ ఇండియా సర్వే ప్రకారం.. దేశంలో ఇంకా 13%ఇండ్లకు విద్యుత్తు సౌకర్యం లేదు.
హామీ-6: జీడీపీ 10% కు పెంచుతం.ప్రస్తుతం జీడీపీ 7.8 శాతంగా ఉన్నది.
హామీ-7: అందరికీ పక్కా ఇల్లు. రిక్స్ నైట్ ఫ్రాంకో నివేదిక ప్రకారం.. ప్రతి ఇద్దరిలో ఒకరికి సొంతిల్లు లేదు.
హామీ-8: ప్రతి ఇంటికి టాయిలెట్. జాతీయ కుటుంబ సర్వే ప్రకారం.. 19.4% కుటుంబాలకు మరుగుదొడ్డి లేదు.
హామీ-9: ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ 25,067 గ్రామాలకు ఇంటర్నెట్ లేదు.
హామీ-10: 100%డిజిటల్ లిటరసీ. 30 శాతం మందికి డిజిటల్ లిటరసీపై అవగాహన లేదు.
హామీ-11: ప్రతి భారతీయుడికి సురక్షిత తాగునీటి నల్లా కనెక్షన్ 50% మందికి నల్లా కనెక్షన్ లేదు.
హామీ-12: దేశాన్ని పోషకాహార లోప రహితంగా మార్చటం. 70% మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు.
హామీ-13: రైలు ప్రమాదాల్లో ఒక్కరు కూడా మరణించకుండా చర్యలు ఈ ఏడాది 13 వేల రైలు ప్రమాదాలు జరిగాయి. 12 వేల మంది మృతి.
హామీ-14: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పూర్తి. చేతులెత్తేశారు.
హామీ-15: 2017-18లో 29% పెట్టుబడి రేటును 36%కి పెంచుతాం. గడిచిన నాలుగేండ్లలో భారత్లో పెట్టుబడి రేటు కేవలం ఒక్క శాతమే పెరిగింది.
హామీ-16: పంట వ్యర్థాల దహనాన్ని తగ్గించి వాయుకాలుష్యాన్ని తగ్గించటం. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తున్నది. ఏమీ చేయలేకపోయింది.
హామీ-17: పీఎం 2.5 (పార్టికులేట్ మ్యాటర్)ను 50 మైక్రాన్లకు తగ్గించటం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ఢిల్లీతోపాటు అనేక నగరాల్లో పీఎం స్థాయి ఇప్పటికీ 300కు పైనే ఉన్నది.
హామీ-18: మరుగుదొడ్లలో మలమూత్రాలను మనుషులు తొలగించే విధానాన్ని పూర్తిగా రూపుమాపటం. ప్రభుత్వ లెక్కల ప్రకారం 42,303 మంది అశుద్ధాన్ని ఎత్తిపోస్తున్నారు. లక్ష దాటొచ్చని ఎన్జీవోలు చెప్తున్నాయి.
హామీ-19: మహిళా కార్మిక శక్తిని 30 శాతానికి పెంచటం. మహిళా కార్మిక శక్తి 19 శాతమే.
హామీ-20: అడవుల విస్తీర్ణాన్ని 21 శాతం నుంచి 33 శాతానికి పెంచటం. దేశంలో అడవుల విస్తీర్ణం 8 ఏండ్లలో పెరిగింది కేవలం 0.71 శాతమే.
హామీ-21: డ్రాపౌట్లు జీరో చేయటం. 15 కోట్ల పిల్లలు బడికి పోవట్లేదు.
హామీ-22: వైద్యుడు, జనాభా శాతాన్ని 1:1,400 మందికి నర్సు, జనాభా శాతాన్ని 1:500కు చేర్చటం :హామీ నెరవేరలేదు.
హామీ-23: శ్రామిక శక్తిలో నైపుణ్యా న్ని15 శాతానికి పెంచటం. నైపుణ్య మానవ వనరులు 4.69%
హామీ-24: సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై పూర్తిగా నిషేధం: సక్సెస్ కాలేదు.
హామీ-25: పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యాన్ని 175 గిగావాట్లకు పెంచటం. ప్రస్తుతం పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యం 98 గిగావాట్లే.
హామీ-26: ఉత్పాదక రంగం వృద్ధిరేటును 2022 నాటికి రెట్టింపు చేయటం. ప్రస్తుతం 8.1 శాతం దాటట్లేదు.
హామీ-27: పభుత్వ దవాఖానలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ సెంటర్లుగా మార్చటం: నెరవేరలేదు.
హామీ-28: ఆరోగ్యరంగంలో 30 లక్షలు, టూరిజంలో 4 కోట్లు, గనుల్లో 50 లక్షల ఉద్యోగాల సృష్టి: నెరవేరలేదు.
హామీ-29: ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ: నెరవేరలేదు.
హామీ-30: మెడికల్ టూరిజం (టెలి మెడిసిన్, ఈ-కన్సల్ట్, టెలిపతీ, టెలి రేడియాలజీ)ను పెంచేందుకు 20 మెడికల్ ఫ్రీ జోన్ల ఏర్పాటు : నెరవేరలేదు.
హామీ-31: వెనుకబడిన ప్రాంతాల్లో వందకుపైగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి చేయటం: నెరవేరలేదు.
హామీ-32: విదేశీ పర్యాటకులను 1.20 కోట్లకు పెంచటం: నెరవేరలేదు.
హామీ-33: 10 ఇన్నోవేషన్ జిల్లాల ఏర్పాటు: నెరవేరలేదు.
హామీ-34: విద్యార్థులకు ఆరో తరగతి నుంచే నైపుణ్య శిక్షణ: నెరవేరలేదు.
హామీ-35: చమురు, సహజవాయు దిగుమతులు తగ్గించటం:నెరవేరలేదు.
హామీ-36: మైనింగ్ రంగంలో వృద్ధిరేటు 14% పెంచటం: నెరవేరలేదు.
హామీ-37: జాతీయ రహదారులను 2 లక్షల కి.మీకి పెంచటం: నెరవేరలేదు.
హామీ-38: మౌలిక వసతుల ప్రాజెక్టుల పూర్తి: నెరవేరలేదు.
హామీ-39: ఉన్నత విద్యలో జీఈఆర్ 35%కు పెంచటం: నెరవేరలేదు.
హామీ-40: 24,800 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం: నెరవేరలేదు.