(స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ):దేశ భద్రత విషయాల్లో మరో దేశ సాంకేతికతపై ఆధారపడటం పొరపాటు. ఈ విషయం 1999 కార్గిల్ యుద్ధం సందర్భంగా భారత్కు బోధపడింది. ఆ సమయంలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) ద్వారా యుద్ధ ప్రాంతానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను భారత్కు అందకుండా అమెరికా ప్రయత్నించిందన్న ప్రచారం జరిగింది. దేశ భద్రత విషయాల్లో పరాధీనత పనికిరాదని గమనించిన నిపుణులు, 2006లో అప్పటి సర్కారు సహకారంతో స్వదేశీ జీపీఎస్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు అప్పగించారు. 2018లో స్వదేశీ జీపీఎస్ సేవలు (నావిక్) అందుబాటులోకి వచ్చినప్పటికీ, బీజేపీ సర్కారు ఆ సాంకేతికతను వినియోగంలోకి తీసుకురావడానికి మీనమేషాలు లెక్కించింది. ఫలితంగా పుల్వామా, గల్వాన్లో భారత్ పెద్ద మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చిందని నిపుణులు చెప్తున్నారు.
అంతా సిద్ధంగా ఉన్నా.. నాన్చుడు
నావిక్ వ్యవస్థ కోసం ఇస్రో 8 ఉపగ్రహాలను ప్రయోగించగా ఒకటి విఫలమైంది. 7 శాటిలైట్లు భూ స్థిర కక్ష్యలో తిరుగుతూ భారత భౌగోళిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు 10 సెంటీమీటర్ల కచ్చితత్వంతో అందిస్తున్నాయి. 2018లో నావిక్పై ఇస్రో తుది ట్రయల్స్ నిర్వహించి క్షేత్రస్థాయిలో అందుబాటులోకి తీసుకురావచ్చని ప్రభుత్వానికి సూచించింది. అయితే, ప్రభుత్వ వాహనాల్లో వినియోగించే లొకేషన్ ట్రాకర్స్లో ఈ వ్యవస్థను వినియోగించాలన్న మోదీ సర్కారు ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రధాని సహా కేంద్రమంత్రులు వినియోగించే కాన్వాయ్లలో ఇప్పటికీ జీపీఎస్ వ్యవస్థనే వినియోగిస్తున్నారు. 2019లో పుల్వామా దాడులు జరిగినప్పుడు, 2020లో గల్వాన్ లోయలో చైనాతో సైనిక ఘర్షణ జరిగినప్పుడూ అమెరికాకు చెందిన మాక్సర్ ఉపగ్రహ చిత్రాలు, జీపీఎస్ వ్యవస్థలపైనే భారత సైన్యం ఆధారపడాల్సి వచ్చింది. దీంతో ఈ రెండు సందర్భాల్లో భారత్ పెద్ద సంఖ్యలో జవాన్లను కోల్పోయింది. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ఉంటే రక్షణపరంగా సైన్యానికి ఇంకా ఎక్కువ భద్రత లభించేదని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పర్వత ప్రాంతాల్లో జీపీఎస్ 20-30 మీటర్ల పొజిషన్ అక్యురసీని చూపిస్తే, నావిక్ ఐదు మీటర్ల అక్యురసీతో పనిచేస్తుందని గుర్తుచేస్తున్నారు. ఎల్-బ్యాండ్ ఫ్రీక్వెన్సీలో పనిచేసే జీపీఎస్తో పోలిస్తే.. ఎల్, ఎస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీతో పనిచేసే నావిక్ మరింత శక్తిమంతమైనదని చెప్తున్నారు.
ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది?
వచ్చే ఏడాది జనవరి నుంచి అన్ని ఫోన్లలో నావిక్ను తప్పనిసరి చేయాలంటూ ప్రభుత్వం ఇటీవల మొబైల్ తయారీదారులకు ఆదేశాలు జారీ చేసినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, నావిక్ అమలుకు కచ్చితమైన కాలపరిమితి ఏమీ నిర్ణయించలేదని ప్రభుత్వం పైకి చెబుతున్నప్పటికీ, అంతర్గతంగా దీనిపై మొబైల్ కంపెనీలను ఒత్తిడికి గురి చేస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వం ఉన్నట్టుండి నావిక్ను తెరపైకి తీసుకురావడానికి రాజకీయ ప్రయోజనాలే కారణమని విశ్లేషకులు అంటున్నారు. దీని వెనుక అగ్రదేశాల సరసన భారత్ను నిలబెట్టామని చెప్పుకొని ఓట్లు దండుకొనే ఎత్తుగడ ఉన్నదని చెప్తున్నారు. అందుకే ఆగమేఘాలమీద ‘నావిక్’ను తెరపైకి తీసుకొచ్చిందని విశ్లేషిస్తున్నారు. త్వరలో పలు రాష్ర్టాల అసెంబ్లీలకు, రెండేండ్లలో లోక్సభకు ఎన్నికలు ఉండటమే దీనికి కారణంగా తెలుస్తున్నది. ఇప్పటికిప్పుడు ఫోన్లలో ‘నావిక్’ ఇన్స్టాలేషన్ చేయడం సాధ్యం కాదని మొబైల్ ఫోన్ల తయారీదారులు చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న మొబైల్ ఫోన్లకు సంబంధించిన చిప్లు ఇప్పటికే తయారయ్యాయని, వాటిని తొలగించి కొత్త చిప్లను (నావిక్ సిస్టమ్తో అనుసంధానమై పనిచేసే) అమర్చాలంటే కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని ఈ కంపెనీలు వాదిస్తున్నాయి. కావాలంటే 2025 జనవరి నాటికి మార్కెట్లోకి రానున్న ఫోన్లలో అయితే ఇన్స్టాలేషన్ చేయగలమని చెప్తున్నాయి.
ఏమిటీ నావిక్?
‘నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్’ను సంక్షిప్తంగా నావిక్గా పిలుస్తున్నారు. భారత భౌగోళిక సమాచారానికి సంబంధించిన నావిగేషన్ సేవలను అందించేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో ఈ సాంకేతికతను రూ.1,400 కోట్లతో అభివృద్ధి చేసింది. దీనిపై 2018లో ట్రయల్స్ను విజయవంతంగా నిర్వహించింది. నావిక్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే దేశంలోని మొత్తం భూభాగపు విశ్వసనీయ సమాచారం స్వీయ సాంకేతిక వ్యవస్థ ద్వారా అందుబాటులోకి వస్తుంది. తెలియని ప్రాంతానికి వెళ్లడానికి ఇప్పుడు ప్రతీఒక్కరూ ఫోన్లో జీపీఎస్ను ఆన్ చేసుకొంటున్నారు. ఈ జీపీఎస్ వ్యవస్థ అమెరికాకు చెందినది. జీపీఎస్ను సైనిక వాహనాల్లో వినియోగించడం వల్ల మన సైన్యం కదలికలు అమెరికాకు తెలిసిపోతాయి. భవిష్యత్తులో దౌత్యసంబంధాలు బలహీనపడితే, ఆ దేశం మనపై ఆంక్షలు విధించవచ్చు. అదే జరిగితే దేశంలోని కోట్లాది మంది ప్రజలు, క్యాబ్ సంస్థలు, డెలివరీ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అందుకే నావిక్ను అభివృద్ధి చేయాల్సిన అవసరం వచ్చింది.