హసన్: అముల్ పాల కన్నా.. నందిని(Nandini) బ్రాండ్ పాలు బెటర్ అని కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీ శివకుమార్(DK Shivakumar) అన్నారు. ఇవాళ హసన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నగరంలోని నందిని మిల్క్ పార్లర్(Milk Parlour)ను విజిట్ చేసి అక్కడే ఆ పాల ఉత్పత్తుల్ని తీసుకున్నారు. కర్నాటకలోకి అముల్ ఉత్పత్తుల్ని తీసుకురావడం పట్ల ఆయన వ్యతిరేకించారు.నందిని తమ రాష్ట్ర ఉత్పత్తి అని, ఆ మిల్క్ బ్రాండ్.. గుజరాత్కు చెందిన అముల్(Amul) కన్నా బెటర్ అని అన్నారు.
తమకు అముల్ అవసరం లేదని, తమ నీళ్లు, పాలు, నేల బలంగా ఉన్నట్లు శివకుమార్ తెలిపారు. రాష్ట్రంలో రైతుల హక్కులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. కర్నాటకలో సుమారు 70 లక్షల మంది రైతులు పాల ఉత్పత్తిలో ఉన్నారని, వాళ్లంతా నందిని సంస్థకు పాలను ఇస్తున్నారని, గుజరాత్లోని అముల్ కూడా రైతుల నుంచే పాలను కొంటోందని, కానీ అముల్ను ముందుకు నెట్టి, నందినిని వెనక్కి నెట్టడం మంచికాదన్నారు. అక్కడి బీజేపీ ప్రభుత్వం రైతులకు ఎటువంటి సాయాన్ని అందించలేదన్నారు. మన ఉత్పత్తుల్ని, మన రైతుల్ని మనమే రక్షించుకోవాలని శివకుమార్ తెలిపారు.
ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. ప్రస్తుతం దేశంలో రెండవ స్థానంలో నందిని బ్రాండ్ ఉందని, ఇక నుంచి ఆ ఉత్పత్తిల్ని విదేశాలకు కూడా సరఫరా చేస్తామని బీజేపీ నేత రవికుమార్ తెలిపారు.