న్యూఢిల్లీ: ఇండియా పేరును భారత్గా మార్చాలని మోదీ సర్కారు ప్రయత్నిస్తున్నట్టు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పేర్లు మార్చుకొన్న దేశాలు.. కారణాలను పరిశీలిద్దాం.
1. టర్కీ-తుర్కియే: టర్కీ తమ దేశం పేరును తుర్కియేగా మార్చుకొంటున్నట్టు 2022 జూన్లో ఐరాసకు తెలిపింది. తుర్కియే అనే పేరు తమ సంస్కృతి, నాగరికత, విలువలకు అద్దంపడుతుందని ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ చెప్పారు. తమ సాంస్కృతిక మూలాలకు మరింత చేరువయ్యేందుకు పేరు మార్చుకొన్నట్టు వెల్లడించారు.
2. హాలండ్-నెదర్లాండ్స్: హాలండ్ తన పేరును నెదర్లాండ్స్గా మార్చుకొన్నది. తన గ్లోబల్ ఇమేజ్ను పెంచుకొనేందుకు పేరు మార్చుకొన్నట్టు ప్రకటించింది. రాజధాని ఆమ్స్టర్డామ్లో విదేశీయులను ఆకర్షించే శక్తివంతమైన మాదక ద్రవ్యాల వినియోగం, చట్టబద్ధమైన వ్యభిచారం నుంచి ప్రపంచం దృష్టిని మరల్చేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నది.
3. చెక్ రిపబ్లిక్-చెకియా: సెంట్రల్ యురోపియన్ దేశం చెక్ రిపబ్లిక్.. ఈ ఏడాదే తన పేరును చెకియాగా మార్చుకొన్నది. స్పోర్ట్స్ కంపెనీలు క్రీడా జట్ల ఉత్పత్తులు, దుస్తులపై పేరును సులభంగా రాసుకొనే వీలు కల్పించేందుకు పేరును మార్చుకొన్నట్టు వెల్లడించింది.
4. బర్మా-మయన్మార్: తరతరాలుగా బర్మన్ జాతి ఆధిపత్య సమూహం తర్వాత ఆ దేశాన్ని సంప్రదాయకంగా బర్మా అని పిలుస్తున్నారు. కానీ, 1989లో పాలక జుంటా ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటును అణచివేసిన ఏడాది తర్వాత ఆ దేశం పేరును సైనిక నాయకులు హఠాత్తుగా మయన్మార్ అని మార్చేశారు.
5.సిలోన్- శ్రీలంక: 1972లో సిలోన్ తన పేరును శ్రీలంకగా మార్చుకొన్నది. వలస, బ్రిటిష్ సంస్కృతి నుంచి సంబంధాలు తెంచుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నది. 2011లో ప్రభుత్వ వినియోగం నుంచి అధికారికంగా వలస రాజ్యాలకు ప్రతీకగా ఉన్న సిలోన్ పేరును పూర్తిగా తొలగించింది.
6. స్వాజిలాండ్-ఈశ్వతిని: కింగ్డమ్ ఆఫ్ స్వాజిలాండ్ పేరును కింగ్డమ్ ఆఫ్ ఈశ్వతినిగా మారుస్తున్నట్టు 2018 ఏప్రిల్లో ఆ దేశ రాజు ఎంస్వాతి- 3 ప్రకటించారు. స్వాజిలాండ్, స్విట్జర్లాండ్ దేశాల మధ్య ఉన్న గందరగోళాన్ని తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నారు.
7.రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా-రిపబ్లిక్ ఆఫ్ నార్త్ మాసిడోనియా: 2019లో రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా పేరును రిపబ్లిక్ ఆఫ్ నార్త్ మాసిడోనియాగా మార్చేశారు. అయితే, తమ పౌరులను నార్త్ మాసిడోనియన్లు అని కాకుండా మాసిడోనియన్లు అని పిలువాలని ఆ దేశం పేర్కొన్నది.
8.పర్షియా-ఇరాన్: ప్రస్తుత ఇరాన్ను సాంప్రదాయకంగా పర్షియా అని పిలుస్తున్నారు. రెజా షా రాజుగా బాధ్యతలు స్వీకరించాక నూతనత్వం కోసం 1935లో పర్షియా పేరును ఇరాన్గా మార్చారు. రాజ్యంపరంగా ఇరాన్ అని పిలుస్తున్నా..ఆహారం, కళలు, సాహిత్యంలాంటి దీర్ఘకాలిక సాంస్కృతిక ఎగుమతులను పర్షియన్గానే వ్యవహరిస్తున్నారు.