హల్ద్వాని: ఉత్తరాఖండ్లోని హల్ద్వానిలో జరిగిన హింస(Haldwani violence) గురించి జిల్లా మెజిస్ట్రేట్ వందనా సింగ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఆదేశాలతోనే హల్ద్వానిలో వివిధ ప్రదేశాల్లో ఆక్రమణకు గురైన ప్రాంతాల్లో డ్రైవ్ చేపట్టినట్లు ఆమె వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ నోటీసులు ఇచ్చామని, స్పందించే సమయం కూడా ఇచ్చామన్నారు. కొందరు హైకోర్టును ఆశ్రయించారని, కొందరికి మాత్రం టైం ఇవ్వలేదన్నారు. టైం ఇవ్వని ప్రాంతాల్లో కూల్చివేత చర్యలు చేపట్టినట్లు వందనా సింగ్ తెలిపారు. ఒక్కర్ని టార్గెట్ చేసి చర్యలు చేపట్టలేదని ఆమె అన్నారు.
ఓ ఖాళీ ప్రదేశంలో ఉన్న ప్రాపర్టీలో రెండు భవనాలు ఉన్నాయని, అది మతపరమైన కట్టడంగా ఎటువంటి రిజిష్ట్రేషన్ లేదన్నారు. ఆ స్థలానికి ఎటువంటి గుర్తింపు లేదన్నారు. కొందరు ఆ కట్టడాన్ని మదర్సా అని పిలుస్తున్నట్లు మెజిస్ట్రేట్ వందనా సింగ్ తెలిపారు. అక్కడ ఉన్న అసెట్స్లో ఎవరూ ఉండడం లేదని, అందుకే కూల్చివేతను కొనసాగించామన్నారు. చాలా శాంతియుతంగా కూల్చివేత ప్రక్రియ స్టార్ అయ్యిందన్నారు. డెమోలిషన్ డ్రైవ్ ప్రారంభమైన అరగంట తర్వాత.. భారీ సంఖ్యలో జనం అక్కడ గుమ్మికూడినట్లు చెప్పారు. ఆ అల్లరిమూక మున్సిపల్ సిబ్బందిపై దాడి చేసినట్లు వెల్లడించారు.
ముందు వచ్చిన ఓ గుంపు రాళ్లతో దాడి చేసిందని, వాళ్లను చెదరగొట్టామన్నారు. ఇక రెండవ గుంపు పెట్రోల్ బాంబులతో అటాక్ చేయడానికి వచ్చినట్లు చెప్పారు. అయినా తమ బృందం మాత్రం ఎవర్నీ రెచ్చగొట్టలేదన్నారు. పోలీసు స్టేషన్పై దాడికి వచ్చారని, ఆ సమయంలో అక్కడ ఉన్న సిబ్బంది ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించిందన్నారు. ఆ గ్యాంగ్ సమీపంలో ఉన్న గాంధీ నగర్ ఏరియాకు వెళ్లిందని, అయితే అక్కడ ఎవరికీ ప్రాణనష్టం జరగకుండా చూసుకునే ప్రయత్నాలు చేశామన్నారు.
తమకు ఉన్న సమాచారం మేరకు .. హింస వల్ల ఇద్దరు మృతిచెందినట్లు జిల్లా మెజిస్ట్రేట్ వందనా సింగ్ తెలిపారు. పోలీసులు ఎవర్నీ రెచ్చగొట్టలేదన్నారు. హింసలో నలుగురు మృతిచెందగా, 250 మంది గాయపడ్డారు.