న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించి వరుసగా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ఆధ్వర్యంలోని నగార్నర్ ఉక్కు కర్మాగారాన్ని పురిటిలోనే చంపేయబోతున్నది. ఈ ప్లాంట్ను తెగనమ్మేందుకు వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా ప్రాథమిక బిడ్లను ఆహ్వానించబోతున్నది. ఎన్ఎండీసీ నుంచి ఎన్ఎస్పీని విభజించి, అందులోని ప్రభుత్వ పూర్తి వాటాను అమ్మేసేందుకు కేంద్ర మంత్రివర్గం 2020 అక్టోబర్లోనే ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం ఎన్ఎండీసీ నుంచి ఈ ప్లాంట్ను విభజించే (డీమెర్జర్) ప్రక్రియ తుది దశలో ఉన్నదని, ఈ ప్రక్రియ పూర్తవగానే ఎన్ఎస్పీ ప్రైవేటీకరణకు ‘దీపం’ (డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్) చర్యలు చేపట్టనున్నదని ఓ అధికారి వెల్లడించారు. 30 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఛత్తీస్గఢ్లో నిర్మితమవుతున్న నగార్నర్ స్టీల్ ప్లాంట్ (ఎన్ఎస్పీ) ఇంకా అందుబాటులోకి రాలేదు. 1,980 ఎకరాల్లో రూ.23,140 కోట్ల వ్యయంతో ఏర్పాటవుతున్న ఈ ప్లాంట్లో ఈ నెలలోనే కార్యకలాపాలు మొదలయ్యే అవకాశాలున్నాయి. ఎన్ఎండీసీ నుంచి విడిపోయాక ఎన్ఎస్పీ ప్రత్యేక సంస్థగా ఏర్పడుతుంది. అనంతరం ఎన్ఎండీసీ వాటాదారులు తమ వాటాల దామాషా ప్రకారం ఎన్ఎస్పీలోనూ వాటాదారులుగా ఉంటారు. తద్వారా ఎన్ఎస్పీలో ప్రభుత్వం 60.79% వాటాను కలిగి ఉంటుంది. మిగిలిన వాటా రిటైల్, సంస్థాగత పెట్టుబడిదారులకు లభిస్తుంది.