ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. ఈనేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఓవైపు ఒమిక్రాన్.. మరోవైపు డెల్టా వేరియంట్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి రోజు 3 లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈనేపథ్యంలో నాగాలాండ్ ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో ప్రజల ముందుకు వచ్చింది.
ప్రస్తుతం పుష్ఫ సినిమా ఫీవర్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దాన్నే మాస్క్ వాడకం కోసం ఉపయోగించుకుంది నాగాలాండ్ ప్రభుత్వం. పుష్ఫ సినిమాలో పుష్పరాజ్(అల్లు అర్జున్), శ్రీవల్లి(రష్మికా) ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను తీసుకొని ఆ ఫోటోలో రష్మిక ముఖానికి యానిమేషన్ సాయంతో మాస్క్ పెట్టి.. శ్రీవల్లి బాధ్యతాయుతమైన సిటిజెన్. తన వాళ్లంటే తనకు చాలా ప్రేమ. అందుకే మాస్క్ ధరించింది. కానీ.. పుష్పలా మాత్రం ఉండకండి. కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించండి.. మహమ్మారిని అందరితో కలిసి తరిమికొట్టండి.. అంటూ ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ట్రెండింగ్ టాపిక్ను పట్టుకొని కరోనాకు భలే మ్యాచ్ చేశారే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.