న్యూఢిల్లీ: గోవా అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రాష్ట్రంలో కాషాయ పార్టీ చేపట్టిన సంకల్ప్ రథయాత్రను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం జెండా ఊపి ప్రారంభించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి ప్రజలకు సేవ చేస్తే గత పాలకులు డ్రైఫ్రూట్స్ తింటూ కాలం గడిపారని ఎద్దేవా చేశారు. గోవాలో బీజేపీ ప్రభుత్వ పురోగతిని, కాషాయ సర్కార్ విజయాలను నడ్డా వివరించారు. ప్రజాస్వామ్య పనిసంస్కృతిని ప్రధాని నరేంద్ర మోదీ మార్చివేశారని కితాబిచ్చారు.
గత పాలకులు తమ కుటుంబ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ అవినీతికి తెరలేపారని నడ్డా దుయ్యబట్టారు. గత పాలకులు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చి ఎన్నికలు ముగిశాకే స్వప్రయోజనాల కోసం పాకులాడారని విమర్శించారు.