మణిపూర్ ముఖ్యమంత్రి పీఠం మళ్లీ బీరేన్ సింగ్నే వరించింది. మణిపూర్ ముఖ్యమంత్రిగా బీరేన్ సింగ్ వరుసగా రెండో సారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం రోజు బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధిష్ఠానం పరిశీలకులుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మరో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా సీఎం పదవికి బీరేన్ సింగ్ పేరును ప్రతిపాదించడంతో ఆయనే తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ…సీఎం అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా నిర్ణయించం స్వాగతించాల్సిన పరిణామమని అన్నారు. ఇక మణిపూర్లో బాధ్యతాయుతమైన, సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు. ఈశాన్య రాష్ట్రాల విషయంలో ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని, ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.