మైసూరు: కర్ణాటకలోని మైసూరు మహానగరంలో ఏటా దసరా ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే గజరాజు బలరామ (Elephant Balarama) ఇక లేదు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో ఆదివారం రాత్రి బలరామ కన్నుమూసింది. ప్రతి దసరా ఉత్సవాలకు బలరామ మీద చాముండేశ్వరీ దేవిని ఊరేగించేవారు. ఊరేగింపులో ఎంత మంది జనం ఉన్నా, ఎన్ని రకాల చప్పుళ్లు ఉన్నా బలరామ అదిరేది కాదు, బెదిరేది కాదని, ఎంతసేపైనా ఓపికగా ఉండేదని ఆలయ పూజారులు చెప్పారు. బలరామ మరణవార్త అందరినీ బాధపెట్టిందన్నారు.
బలరామ గత కొన్ని రోజులుగా ఆహారం ముట్టలేదని, కనీసం మంచినీళ్లు కూడా తాగలేదని ఆ ఏనుగు కేర్ టేకర్ చెప్పారు. సోమవారం ఉదయం బలరామకు పోస్టుమార్టం నిర్వహించామని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించామని అధికారులు తెలిపారు. గజరాజు బలరామ 1958లో జన్మించిందని, జీవితంలో ఎక్కువ కాలం కర్ణాటకలోని నగర్హోల్ టైగర్ రిజర్వ్లో నివసించిందని వెల్లడించారు. మైసూరు దసరా ఉత్సవాల్లో గజరాజు బలరామ మొత్తం 13 సార్లు చాముండి అమ్మవారి అంబారిని మోసిందని చెప్పారు.
కాగా, గజరాజు బలరామ మృతిపట్ల ప్రధాని నరేంద్రమోదీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోసహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. దాదాపు ఒక దశాబ్ద కాలానికిపైగా మైసూరు దసరా ఉత్సవాల్లో తన సేవలను అందించిందని పేర్కొన్నారు. గజరాజు భౌతికంగా లేకపోయినా, తన జ్ఞాపకాలు మైసూరు ప్రజల గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాయంటూ ట్వీట్లు చేశారు.