Mysterious Sounds | మహారాష్ట్ర (Maharashtra)లోని లాతూర్ (Latur )లో భయాందోళనలు నెలకొన్నాయి. నగరంలోని వివేకానంద్ చౌక్ (Vivekanand Chowk) సమీపంలో భూగర్భం నుంచి వింత శబ్దాలు (Mysterious Sounds) వచ్చాయి. దీంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. బుధవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో భూమిలోపలి నుంచి ఒక్కసారిగా వింత శబ్దాలు రావడం మొదలయ్యాయని స్థానికులు తెలిపారు. దాదాపు 15 నిమిషాల పాటు శబ్దాలు వినిపించాయని చెప్పారు.
విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితి పరిశీలించారు. వింత శబ్దాలకు గల కారణాలపై పరిశోధనలు మొదలు పెట్టారు. మరోవైపు భూగర్భంలో నుంచి వచ్చిన శబ్దాలు ఏ ఉపద్రవానికి సంకేతమోనని లాతూర్ వాసుల్లో ఆందోళన నెలకొంది. భూకంపం కావచ్చ (Quake Rumours)నే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో 1993లో కిల్లారీ ( Killari) గ్రామం చుట్టుపక్కల భూకంపం వచ్చి దాదాపు 10 వేల మంది చనిపోయారు. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ జనం భయంతో వణికిపోతున్నారు.
మరోవైపు లాతూర్లో భూకంపం వచ్చే సూచనలు ఏమీ లేవని డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖకు చెందిన అధికారులు తెలిపారు. లాతూర్ చుట్టుపక్కల ప్రాంతంలో గతంలోనూ ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయని చెప్పారు. 2022 సెప్టెంబర్లో హసోరి (Hasori), కిల్లారి (Killari) చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భూగర్భంలో నుంచి వింత శబ్దాలు వినిపించాయని గుర్తుచేశారు. ఆందోళన చెందాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు.
కాగా, మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా హసోరి గ్రామంలో గతేడాది సెప్టెంబర్లో భూగర్భం నుంచి వింత శబ్దాలు వినిపించిన విషయం తెలిసిందే. గ్రామస్థులు మొదట ఆశ్చర్యానికి గురైనప్పటికీ వారం రోజులుగా శబ్దాలు కొనసాగడంతో అప్పట్లో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మాగ్నటిజమ్ నిపుణులు, నాందేడ్లోని స్వామీ రామానంద తీర్థ్ మరాఠ్వాడా యూనివర్శిటీ నిపుణులు అధ్యయనం చేపట్టారు.