అహ్మదాబాద్: గుజరాత్లో గత కొన్ని రోజులుగా వింతగా ఉన్న లోహపు బంతులు ఆకాశం నుంచి రాలి పడుతున్నాయి. తాజాగా సురేంద్ర నగర్ జిల్లా సైలా గ్రామంలోని పంటపొలాల్లో చెల్లా చెదురుగా పడి ఉన్న వింత వస్తువులను గ్రామస్తులు చూశారు. గత మూడు రోజులుగా నలుపు, సిల్వర్ రంగులో ఉన్న మెటల్ బాల్స్ అంతరిక్షం నుంచి పడుతున్నాయని చెప్పారు. ఖేడా జిల్లాలోని ఉమ్రేత్, నాడియాడ్ గ్రామాలతోపాటు ఆనంద్ జిల్లాలోని మూడు గ్రామాలలో ఆకాశం నుంచి ఇవి పడ్డాయి.
ఈ నెల 12న ఆనంద్ జిల్లాలోని భలేజ్, ఖంభోల్జ్, రాంపుర గ్రామాల్లో ఆకాశం నుంచి మిస్టీరియస్ శిథిలాలు రాలి పడ్డాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు. భలేజ్ ప్రాంతంలో గురువారం సాయంత్రం 4.45 గంటలకు ఐదు కేజీల బరువున్న నల్ల రంగులోని మెటల్ బాల్ పడింది. ఖంభోల్జ్, రాంపుర గ్రామాల్లో కూడా ఇలాంటివి ఆకాశం నుంచి పడ్డాయి. ఈ మూడు గ్రామాలు 15 కిలోమీటర్ల పరిధిలో పక్కపక్కనే ఉన్నాయి.
కాగా, ఆందోళన చెందిన గ్రామస్తులు దీని గురించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆకాశం నుంచి రాలిపడిన శిథిలాలను పోలీసు అధికారులు పరిశీలించారు. శాటిలైట్ వ్యర్థాలుగా వారు బావిస్తున్నారు. వీటి వల్ల ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని ఆనంద్ జిల్లా ఎస్పీ అజిత్ రాజియన్ తెలిపారు. ఖంభోల్జ్ లో ఒక ఇంటికి సమీపంలో, మరో రెండు చోట్ల బహిరంగ ప్రదేశాల్లో ఆకాశం నుంచి లోహపు బంతులు పడినట్లు చెప్పారు. దీనిపై దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిపుణులను పిలిపించినట్లు వెల్లడించారు.
మరోవైపు గుజరాత్లోని మూడు జిల్లాల్లో ఆకాశం నుంచి రాలిపడుతున్న అంతరిక్ష వ్యర్థాలను పరిశీలించేందుకు ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (పీఆర్ఎల్) రంగంలోకి దిగింది. దేశ అంతరిక్ష డిపార్ట్మెంట్కు చెందిన ఈ ప్రభుత్వ లాబొరేటరీ, స్పేస్ సైన్స్పై పరిశోధనలు చేస్తుంది.