బెంగళూరు: ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్తో ఆస్పత్రిలో చేరిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి (Kumaraswamy) ఇవాళ (ఆదివారం) ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. సకాలంలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందడంతో ముప్పు తప్పిందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ.. ఇది తనకు మూడో జన్మ అని చెప్పారు. దేవుడి దయవల్లే తాను మళ్లీ బతికానని చెప్పారు.
సకాలంలో తనకు చికిత్స అందించి కాపాడిన వైద్యుల బృందానికి కుమారస్వామి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు తాను కొత్త జీవితాన్ని పొందానని చెప్పారు. స్ట్రోక్ వంటి లక్షణాలు కనిపిస్తే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయొద్దన్నారు. ‘ఈ రోజు మీతో మాట్లాడుతున్నానంటే నేను పునర్జన్మ పొందినట్టే చెప్పాలి. ఒక వ్యక్తికి ఒక జన్మ ఉంటే.. నా ఆరోగ్యం విషయంలో 64 ఏళ్ల వయసులో దేవుడు నాకు మూడో జన్మ ఇచ్చినట్టు భావిస్తున్నా’ అని కుమారస్వామి చెప్పారు.
ఆస్పత్రిలో చేరిన రోజు జరిగిన పరిణామాలను గుర్తుచేసుకుంటూ ‘ఆ రోజు అర్ధరాత్రి రెండు గంటలకు మెలకువ వచ్చింది. అనారోగ్యంగా ఉన్నట్లు గుర్తించా. పక్షవాతం లక్షణాలు కావచ్చని అనుమానం వచ్చింది. ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించా. వారి సలహాలతో ఆస్పత్రిలో చేరాను’ అని చెప్పారు. స్ట్రోక్కు సంబంధించిన లక్షణాలు కనిపించినప్పుడు ఒక్క నిమిషం కూడా వృథా చేయొద్దన్నారు.
ఆ రోజు నిర్లక్ష్యం చేసి ఉంటే జీవితాంతం తాను మంచానికే పరిమితమయ్యేవాడినని అన్నారు. కాగా, కుమారస్వామి ఆగస్టు 30న తెల్లవారుజామున అస్వస్థతతో నగరంలోని ఓ ఆస్పత్రిలో చేరారు. పరిశీలించిన వైద్యులు ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని గుర్తించారు. సకాలంలో వైద్యం అందించి ఆయనను పక్షవాతం బారిన పడకుండా కాపాడారు.