Naveen Jindal | పారిశ్రామికవేత్త, బీజేపీ నాయకుడు నవీన్ జిందాల్ తన జీవితం `తెరిచిన పుస్తకం` అని పేర్కొన్నారు. ప్రజలకు తన పట్ల నమ్మకం ఉందని, తనకు న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం ఉందని చెప్పారు. కోల్ స్కాంలో నిందితుడన్న ఆరోపణలపై మీడియా అడిగి ప్రశ్నలకు సమాధానం చెబుతూ పై విధంగా అన్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన నవీన్ జిందాల్.. హర్యానాలోని కురుక్షేత్ర లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నవీన్ జిందాల్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు, మీడియాకు అన్ని రకాల ప్రశ్నలు అడిగే హక్కు ఉందని చెప్పారు.
`నా జీవితం తెరిచిన పుస్తకం. మేం సాధారణ వ్యక్తులం. నా తండ్రి (కీ.శే.) ఓపీ జిందాల్ చాలా కష్టపడి పని చేశారు. నా సోదరులు కూడా చాలా కష్టపడి పని చేశారు. మేం పలు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి లక్షల మందికి ఉపాధి కల్పించాం. గత 20 ఏండ్లలో ప్రభుత్వానికి రూ.కోట్లలో పన్నులు చెల్లించాం` అని నవీన్ జిందాల్ అన్నారు. హర్యానా గడ్డపై పుట్టిన తాము దేశ అభివృద్ధి కోసం ఎంతో పని చేశాం అని చెప్పారు.
`మేం ప్రతి రంగంలోనూ పని చేశాం. ఎవరైనా ఏదైనా పని చేసినప్పుడు కొందరు ప్రజలు కొన్ని సందర్భాల్లో సమస్యలు లెవనెత్తుతారు. కానీ, చివరకు నిజం బయటకు వస్తుంది. నిజం మీ అందరి ముందు ఉంది. దీనికి పదేండ్లకు పైగా సమయం పట్టింది. ఒకరు ఎవరిపైనైనా ఆరోపణలు చేయొచ్చు. కానీ, ప్రజలు నన్ను నమ్ముతున్నారు. నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. నేను తప్పు చేశానా.. లేదా.. అన్నది చివరకు తెలుస్తుంది` అని అన్నారు. కోల్ బ్లాక్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని నవీన్ జిందాల్పై మూడు కేసులు నమోదైనా.. గత ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 20 వరకూ అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల్లో పర్యటించడానికి నవీన్ జిందాల్కు ఢిల్లీ న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. కురుక్షేత్ర లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున 2004-14 మధ్య పార్లమెంట్కు నవీన్ జిందాల్ ప్రాతినిధ్యం వహించారు.