ముజఫర్నగర్, మే 7 : సకల సౌకర్యాలు అనుభవిస్తూ, ప్రభుత్వానికి బకాయి పడిన రూ.4 లక్షల పన్ను వసూలు కోసం వెళ్లిన అధికారులపై యూపీలోని ఒక కాంగ్రెస్ నాయకుడు దౌర్జన్యానికి దిగాడు. దీంతో అతనికి బుద్ధి చెప్పేందుకు వారు పెద్దయెత్తున చెత్తను అతని ఇంటి ముందు పారేసి, అతని ఇంటిని మినీ డంపింగ్ యార్డ్గా మార్చేశారు. ఈ ఘటన ముజఫర్నగర్లో జరిగింది.
ఖతౌలి మున్సిపాల్టీ పరిధిలో నివసించే జమిల్ అన్సారీ అనే కాంగ్రెస్ నేత మున్సిపాల్టీకి రూ.4 లక్షల పన్ను బకాయిపడ్డాడు. సోమవారం పన్ను వసూలుకు వెళ్లిన మున్సిపల్ సిబ్బందిని దూషించి, వారి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆగ్రహం చెందిన సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా మంగళవారం మూడు ట్రక్కుల చెత్తను తెచ్చి అన్సారీ ఇంటి ముందు పారబోసి, అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ ప్రాంతమంతా దుర్వాసన వ్యాపించడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. పలువురు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.