చండీఘడ్: ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చు అని పంజాబ్, హర్యానా కోర్టు ఓ తీర్పులో పేర్కొన్నది. సింగిల్ జడ్జి జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీ ఓ కేసులో ఈ తీర్పును వెలువరించారు. తమకు రక్షణ కల్పించాలని ఓ ముస్లిం జంట కోర్టును ఆశ్రయించింది. 16 ఏళ్ల అమ్మాయి, 21 ఏళ్ల అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. అయితే తమ ఫ్యామిలీ సభ్యుల నుంచి రక్షణ కావాలని వాళ్లు పంజాబ్ కోర్టును వేడుకున్నారు. ఈ కేసులో కోర్టు ఇవాళ తీర్పునిస్తూ 16 ఏళ్లు నిండిన ముస్లిం మహిళ తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లిచేసుకోవచ్చు అని పేర్కొన్నది.
పఠాన్కోట్కు చెందిన ముస్లిం జంట కోర్టులో కేసు దాఖలు చేసింది. ఫ్యామిలీ సభ్యులకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారని వాళ్ల ప్రాథమిక హక్కుల్ని కాలరాయలేమని జస్టిస్ జస్జిత్ తన తీర్పులో తెలిపారు. ఇస్లామిక్ షరియా చట్టాన్ని తన తీర్పులో ప్రస్తావించిన జస్టిస్ బేడీ.. ముస్లిం అమ్మాయిల పెళ్లిళ్లు ముస్లిం పర్సనల్ చట్టం పరిధిలోకి రానున్నట్లు చెప్పారు.
సర్ దిన్షా ఫర్దునిజి ముల్లా రాసిన మొహమ్మదీయ సూత్రాల్లో ఆర్టికల్ 195 ప్రకారం ముస్లిం అమ్మాయికి 16 ఏళ్లు నిండాయని, ఆ రూల్ ప్రకారం ఆమె పెళ్లి చేసుకోవచ్చు అని, అబ్బాయి వయసు 21 ఏళ్లు దాటాయని, ముస్లిం పర్సనల్ లా కూడా దీన్ని అంగీకరిస్తుందని జడ్జి తెలిపారు. ముస్లిం జంట ఈ ఏడాది జూన్ 8వ తేదీన పెళ్లి చేసుకున్నది. కానీ వాళ్ల పెద్దలు దీన్ని వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఆ జంట కోర్టును ఆశ్రయించింది.