ముంబై: మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బీజేపీ ముర్జీ పటేల్ను తన అభ్యర్థిగా బరిలో దించింది. అంధేరీ ఈస్ట్ నియోజకవర్గానికి నవంబర్ 3న ఉపఎన్నిక జరుగనుంది. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో శివసేనలోని ఉద్ధవ్ థాకరే వర్గం రమేశ్ లట్కే సతీమణి రుతుజా లట్కేను అంధేరీ నుంచి బరిలో దించింది.
తాజాగా బీజేపీ ముర్జీ పటేల్ను తమ అభ్యర్థిగా ఖరారు చేసింది. ఇవాళే నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కూడా కావడంతో.. అభ్యర్థిగా తన పేరు ఖరారైన వెంటనే ముర్జి పటేల్ నామినేషన్ దాఖలు చేశారు. ముర్జీపటేల్కు శివసేనను చీల్చి బీజేపీతో కలిసిన ఏక్నాథ్ షిండే వర్గం తన మద్దతు ప్రకటించింది.
ఇటీవల మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే శివసేన నేతృత్వంలోని మహా కూటమి సర్కారును కుప్పకూల్చి 40 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష బీజేపీవైపు వెళ్లారు. దాంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి షిండేకు సీఎం పదవి కట్టబెట్టింది. ఈ క్రమంలో ఉపఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో తన అభ్యర్థిని గెలిపించుకుని ప్రజల్లో తమ బలం ఏమాత్రం తగ్గలేదని నిరూపించే పనిలో ఉద్ధవ్ బిజీగా ఉన్నారు.