లక్నో: తాను స్వర్గంలో ఉన్నానని హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొందున్న నిందితుడు జైలు నుంచి సోషల్ మీడియాలో లైవ్ వీడియో ప్రసారం చేశాడు. (Murder Accused Live From UP Jail) ఇది వైరల్ అయ్యింది. దీంతో ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2019 డిసెంబర్ 2న షాజహాన్పూర్లోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యుడీ) కాంట్రాక్టర్ రాకేష్ యాదవ్పై కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ హత్య కేసులో ఆసిఫ్తోపాటు మరో నిందితుడైన రాహుల్ చౌదరి ప్రస్తుతం బరేలీ సెంట్రల్ జైలులో ఉన్నారు.
కాగా, జైలులో ఉన్న ఆసిఫ్ ఇటీవల సోషల్ మీడియా ద్వారా లైవ్లో మాట్లాడాడు. ‘నేను స్వర్గంలో ఉన్నా. జైలులోని సౌకర్యాలతో ఆనందిస్తున్నా’ అని అందులో పేర్కొన్నాడు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో హత్యకు గురైన యాదవ్ సోదరుడు జిల్లా కలెక్టర్ ఉమేష్ ప్రతాప్ సింగ్ను గురువారం కలిశాడు. జైలులో ఉన్న నిందితులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారని లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో డీఐజీ కిషోర్ దీనిపై స్పందించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.