ముంబై: అతనో గ్యాంగ్స్టర్. పలు హత్య కేసుల్లో నిందితుడైన అతడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ నిమిత్తం జైలు నుంచి ఫుల్ బందోబస్తు మధ్య వ్యాన్లో కోర్టుకు తీసుకెళ్తున్నారు. ఇంతలో జైలు వద్ద ఆ గ్యాంగ్స్టర్ అనుచరులు ప్రత్యక్షమయ్యారు. పోలీస్ వ్యాన్లో ఉన్న అతనితో కేక్ కట్ చేయించి వేడుక చేసుకున్నారు. దీన్నంతా వీడియోతీసి తమ వాట్సప్ స్టేటసుల్లో పెట్టుకున్నారు. అదికాస్తా వైరల్ అవడంతో పోలీసులపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
మహరాష్ట్రలోని థానే జిల్లా ఉల్హాస్నగర్కు చెందిన రోషన్ ఝా.. పేరుమోసిన గ్యాంగ్స్టర్. అతనిపై పులు హత్యారోపణలు ఉన్నాయి. హత్యా యత్నం కేసులు, కిడ్నాప్ ఇలా ఒకటేమిటి వివిధ రకాల కేసులు నమోదయ్యాయి. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉండటంతో అతడిని పోలీసులు అరెస్టుచేసి జైలుకు తరలించారు. కేసు విచారణలో భాగంగా జైలు నుంచి కోర్టుకు పోలీస్ వ్యాన్లో తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో జైలు బయట గుమికూడిన అతని అనుచరులు వ్యాన్ ఆపారు. అతని బర్త్డే సందర్భంగా ఓ కేక్ తీసుకొచ్చారు. పోలీస్ వ్యాన్లో నుంచే అతడు ఆ కేక్ను కోసి వారికి పంచాడు. ఇంత జరుగుతున్నా పోలీసులు అడ్డుకోకపోగా కనీసం అభ్యంతరమూ చెప్పలేదు. ఈ వ్యవహారాన్నంతా అతని అనుచరులు తమ కెమెరాల్లో బంధించి వాట్సప్ స్టేటస్లుగా పెట్టుకున్నారు. అవికాస్తా వైరల్గా మారాయి.
దీంతో పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఇక బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడికి అంత స్వేచ్ఛ ఇవ్వడమేంటని సందేహం వ్యక్తంచేస్తున్నారు.