ముంబై: ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలు కలకలం రేపిన సంగతి తెలుసు కదా. ఈ కేసులో అనుమానితుడిని సీసీటీవీ కెమెరాలో పోలీసులు గుర్తించారు. అతడు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్ వేసుకున్నట్లు అందులో కనిపించింది. అతడే అంబానీ ముందు జిలెటిన్ స్టిక్స్ ఉన్న వాహనాన్ని నిలిపినట్లు ముంబై పోలీసులు తెలిపారు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు అతడు పీపీఈ కిట్ ధరించినట్లు పోలీసులు చెప్పారు. పేలుడు పదార్థాలు ఉన్న వాహనం అక్కడ ఉంచిన తర్వాత అనుమానితుడు మరో వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
గత నెల 25వ తేదీన 20 జిలెటిన్ స్టిక్స్ ఉన్న స్కార్పియో వాహనం అంబానీ ఇల్లు అయిన ఆంటిలియా ముందు గుర్తించిన విషయం తెలిసిందే. ఆ వాహనాన్ని ఫిబ్రవరి 18న ఐరోలీ ప్రాంతంలో దొంగిలించారు. ఆ తర్వాత ఆ వాహన యజమాని మన్సుక్ హిరేన్ అనుమానాస్పద స్థితిలో మరణించడం ఈ మిస్టరీని మరింత పెంచింది.