ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ ముకేశ్ అంబానీకి చెందిన హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి బుధవారం బెదిరింపు కాల్ వచ్చింది. రిలయన్స్ ఆస్పత్రిని బాంబులతో పేల్చివేస్తామని, ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, కుమారులు ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీలను చంపేస్తామని కాలర్ బెదిరంచాడు.
బుధవారం మధ్యాహ్నం 12.45 గంటలకు ఒకసారి, సాయంత్రం 5.04 గంటలకు ఒకసారి కాలర్ నుంచి రిలయన్స్ ఆస్పత్రి కాల్ సెంటర్కు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికార ప్రతినిధి ధృవీకరించారు. కాగా, ఈ ఘటనపై బుధవారమే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
నిందితుడి నుంచి రిలయన్స్ ఆస్పత్రి ల్యాండ్ లైన్ నెంబర్కు వచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. అతని ఫోన్ సిగ్నల్స్ బీహార్లో ఉన్నట్లు తెలుసుకుని ఆ రాష్ట్రంలోని దర్బంగా జిల్లాలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని తీసుకుని పోలీసులు ముంబైకి బయలుదేరారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నది.