Godan Express | ముంబై : ముంబై – గోరఖ్పూర్ గోదాన్ ఎక్స్ప్రెస్ రైల్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద ఘటన నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం సంభవించింది. సీటింగ్ కమ్ లగేజీ రేక్ కోచ్లో మంటలు చెలరేగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేసింది. ప్రయాణికులను ఇతర రైళ్లల్లో తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
అయితే నాసిక్ రోడ్డు స్టేషన్ నుంచి రైలు బయల్దేరిన కాసేపటికే కోచ్లో పొగలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత క్షణాల్లోనే మంటలు చెలరేగాయని ప్రయాణికులు తెలిపారు. రైలును వెంటనే నిలిపివేశారు. తీవ్ర ఆందోళనకు గురైన ప్రయాణికులు క్షణాల్లోనే రైలును దిగేశారు. సమీపంలోనే హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉండటంతో వాటికి మంటలు వ్యాపించకుండా అధికారులు, అగ్నిమాపక సిబ్బంది చర్యలు తీసుకున్నారు.