ముంబై : కార్డిలియా క్రూయిజ్ అనే భారీ నౌకలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆ క్రూయిజ్లో ప్రయాణిస్తున్న 2 వేల మంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 2 వేల మందితో కార్డిలియా క్రూయిజ్ ముంబై నుంచి గోవాకు బయల్దేరింది. క్రూయిజ్ సిబ్బంది కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో.. అతనికి నౌక డాక్టర్ కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. అతను కరోనా పాజిటివ్గా పరీక్షించబడ్డాడు. దీంతో నౌకను వాస్కోలోని మోర్ముగావ్ పోర్టు వద్ద నిలిపేశారు.
నౌకలోని 1471 ప్రయాణికులు, 595 మంది సిబ్బందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలు రావాల్సి ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని నౌక సిబ్బంది తెలిపింది. అయితే చాలా మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని నౌక సిబ్బంది తేల్చిచెప్పింది. కేవల ఒకరికి మాత్రమే కరోనా సోకిందని స్పష్టం చేసింది. ప్రయాణికుల, సిబ్బంది ఫలితాలు వచ్చిన తర్వాత, తదుపరి చర్యలపై ఆలోచిస్తామని పేర్కొంది.