ముంబై, ఆగస్టు 7: ‘కనబడుట లేదు..’ ఈ ప్రకటన మనం చాలాసార్లు చూసే ఉంటాం. ఆ ప్రకటనే పూజ అనే బాలికను తొమ్మిదేండ్ల తర్వాత తన తల్లి, అన్నయ్య దగ్గరకు చేర్చింది. హృదయానికి హత్తుకునే సంఘటన ముంబైలోని అంధేరీలో చోటుచేసుకున్నది. తొమ్మిదేండ్ల కిందట అంటే.. 2013 జనవరి 22న ఏడేండ్ల బాలిక తన అన్నయ్యతో కలిసి రోజులాగే బడికి వెళ్లింది. అక్కడ ఆడుకుంటున్న ఆ చిన్నారికి ఐస్క్రీం ఇప్పిస్తానని చెప్పి హెన్రీ జోసెఫ్ డిసౌజా అపహరించాడు. ఆ తర్వాత ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు పూజను కర్ణాటకలోని ఓ హాస్టల్లో చేర్పించాడు. అన్నీ డిసౌజా అని పేరు కూడా మార్చాడు. ప్రస్తుతం అమ్మాయి వయసు 16 ఏండ్లు.
మద్యం మత్తులో బయటపడ్డ నిజం..
ఓ రోజు హెన్రీ జోసెఫ్ మద్యం మత్తులో పూజ తమ సొంత కూతురు కాదన్న విషయం ఆమెకే చెప్పాడు. దీంతో తన స్నేహితురాలితో కలిసి తన గురించి ఏమైనా ప్రకటనలు ఉన్నాయా అని వెతకడం ప్రారంభించారు. చివరికి ఓ ప్రకటన చూసి అందులో నంబర్లకు ఫోన్ చేశారు. అయితే నాలుగు నంబర్లు పనిచేయడం లేదు. అదృష్టం కొద్ది చివరి నంబర్ పనిచేసింది.
అది పూజ ఇంటి పక్కన ఉండే రఫీఖ్ నంబర్. రఫీఖ్కు తన గురించి చెప్పడంతో.. పూజ తల్లికి ఈ విషయం చెప్పాడు. వీడియో కాల్ మాట్లాడి పూజను తల్లి గుర్తుపట్టింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో హెన్రీ జోసెఫ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు పిల్లలు పుట్టకపోవడంతో పూజను కిడ్నాప్ చేసినట్టు అతడు అంగీకరించాడు. కాగా, పూజను తీసుకెళ్లిన కొద్ది కాలానికి హెన్రీకి సంతానం కలిగింది. అప్పటి నుంచి పూజతో ఇంటి పనులు చేయించేవారని, సరిగ్గా చూసుకోలేదని తెలిసింది. ఇలా పూజ తన కుటుంబాన్ని కలిసింది. అయితే ఇటీవలే పూజ తండ్రి చనిపోయాడు. పూజను చూసిన తల్లి, అన్నయ్య ఆనందానికి అవధుల్లేవు.