ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ కొందరు విదేశీయులతో టచ్లో ఉన్నట్లు నార్కొటిక్స్ బ్యూరో తెలిపింది. సదరు విదేశీయులు ఒక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాకు చెందిన వారని ఎన్సీబీ ఆరోపించింది. ఏడురోజులుగా ఎన్సీబీ కస్టడీలో ఉన్న ఆర్యన్ వేసిన బెయిలు పిటిషన్ విచారణ సందర్భంగా ఎన్సీబీ ఈ వివరాలు వెల్లడించింది.
ఆర్యన్ బెయిలు పిటిషన్కు వ్యతిరేకంగా ఎన్సీబీ వాదించింది. ఈ క్రమంలో అక్రమంగా డ్రగ్స్ సంపాదించడం కోసం అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధం ఉన్న కొందరు విదేశీయులతో ఆర్యన్ టచ్లో ఉన్నట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు.
ఇలా అక్రమంగా సంపాదించిన వస్తువుల పంపిణీలో కూడా ఆర్యన్ పాత్ర ఉన్నట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎన్సీబీ పేర్కొంది. ఆర్యన్, అర్బాజ్ మర్చంట్కు ఆచిత్, హరిజన్ అనే వ్యక్తులు చరస్ సరఫరా చేసినట్లు తెలుస్తోందని ముంబై కోర్టుకు ఎన్సీబీ వెల్లడించింది. ఈ క్రమంలో నిందితులు వేసిన బెయిల్ పిటిషన్లకు వ్యతిరేకంగా ఎన్సీబీ వాదనలు సమర్పించింది.