ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేలను ఈ నెల 10న మూసివేయనున్నారు. వర్షాకాలానికి ముందు చేపట్టే నిర్వాహణ, మరమ్మత్తు పనుల కోసం రెండు రన్వేలైన 14/32, 09/27 మూసివేయనున్నట్లు ఎయిర్పోర్ట్ ప్రతినిధి తెలిపారు. వచ్చే మంగళవారం (మే 10) ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు చెప్పారు. నిర్వాహణ పనుల అనంతరం అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు.
కాగా, రన్వే మూసివేత అనేది ప్రతి ఏటా జరిగే తంతు అని ముంబై ఎయిర్పోర్ట్ ప్రతినిధి తెలిపారు. విమాన ప్రయాణికుల భద్రత కోసం రన్వేల నిర్వహణ అనేది విధిగా కొనసాగుతున్న కార్యాచరణ అని చెప్పారు. దీంతో మే 10న ముంబై విమానాశ్రయాన్ని కొన్ని గంటలపాటు మూసివేస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలతోపాటు ప్రయాణీకులకు అసౌకర్యాన్ని నివారించడానికి విమానాశ్రయానికి సంబంధించిన అన్ని వర్గాలకు ఈ మేరకు నోటీసు జారీ చేసినట్లు వెల్లడించారు.