న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. ఈ సందర్భంగా నఖ్వీ సేవలను మోదీ ప్రశంసించారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగిన నఖ్వీ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రేపటితో ఆయన రాజ్యసభ పదవీకాలం కూడా ముగియనుంది. ప్రధాని మోదీ కేబినెట్లో కేంద్రమంత్రులుగా కొనసాగుతున్న రాజ్నాథ్ సింగ్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ.. అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్లో కూడా కేబినెట్ మంత్రులుగా పని చేశారు. ఆ ఇద్దరిలో ఇవాళ ఒకరు రాజీనామా చేశారు. ఇక మిగిలింది రాజ్నాథ్ సింగ్ మాత్రమే.
అయితే నఖ్వీ ఉప రాష్ట్రపతి రేసులో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నఖ్వీని పోటీ చేయించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఇవాళ ఉదయం ప్రధాని మోదీతో జేపీ నడ్డా, నఖ్వీ సమావేశమయ్యారు. అనంతరం ఆయన రాజీనామా చేశారు. ఇక ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జులై 19. ఆగస్టు 6న ఎన్నిక నిర్వహించనున్నారు.