అహ్మదాబాద్ : ఆర్ధిక ప్రపంచాన్ని బ్లాక్చైన్ టెక్నాలజీ మార్చివేస్తుందని తాను నమ్ముతానని, భారత్లో డిజిటల్ విప్లవం సాగుతోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ, ఆసియాలో అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. గిఫ్ట్ సిటీలో అంతర్జాతీయ ఆర్ధిక సేవల అధారిటీ (ఐఎఫ్ఎస్సీఏ) ఆధ్వర్యంలో జరిగిన ఇన్ఫినిటీ ఫోరం కార్యక్రమంలో ముఖేష్ అంబానీ మాట్లాడారు.
దేశంలో డిజిటల్ విప్లవం సాగుతోందని, బ్లాక్చైన్ టెక్నాలజీ ఆర్ధిక సేవల ముఖచిత్రాన్ని పునర్నిర్వచిస్తుందని ముఖేష్ పేర్కొన్నారు. భారత్లో క్రిప్టోకరెన్సీ, డేటా ప్రొటెక్షన్ బిల్లుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఈ దిశగా సాగుతున్న కసరత్తు, పురోగతిని ఆయన స్వాగతించారు.
కాలానికంటే ముందుగా ఆలోచించే ప్రధాని నరేంద్ర మోదీ ముందుచూపుతోనే డిజిటల్ విప్లవం సాధ్యమైందని అన్నారు. నేడు అందుబాటులోకి వచ్చిన ఆధార్, యూపీఐ వంటి పటిష్టమైన భద్రతతో కూడిన వ్యవస్ధతో సామాన్యులు సైతం బ్యాంకింగ్ వ్యవస్ధలో చేరారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది 5జీ రాకతో భారత్ ప్రపంచంలోనే అత్యంత ఆధునిక డిజిటల్ టెక్నాలజీలను సంతరించుకుంటుందని అన్నారు.