Mumbai Court : మహిళల అణుకువకు భంగం కలిగించడం, వారితో అనుచితంగా ప్రవర్తించడం శిక్షార్హమైన నేరం. ఇలాంటి నేరానికి పాల్పడిన ఓ వ్యక్తిని ముంబై కోర్టు దోషిగా తేల్చింది. సదరు వ్యక్తి మహిళను అసభ్యంగా తాకడమే కాకుండా ఆమెకు కన్నుకొట్టాడు. ఈ కేసు విచారించిన కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. వాస్తవానికి ఆ వ్యక్తికి యావజ్జీవ శిక్ష విధించాలని కోర్టు భావించింది. కానీ అతడికి ఎలాంటి నేర చరిత్ర లేకపోవడం, చిన్న వయసు కావడంతో ప్రొబేషన్ బెనిఫిట్ ఇవ్వాలని ముంబై కోర్టు మేజిస్ట్రేట్ ఆర్తి కులకర్ణి నిర్ణయించారు.
అయితే బాధిత మహిళ అనుభవించిన మానసిక వేదనను విస్మరించలేమని, అదే సమయంలో నిందితుడికి శిక్ష విధించడం వల్ల అతని భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. భారత శిక్షాస్మృతి (ఐపీసీ) లోని సెక్షన్ 354 కింద నిందితుడు మహ్మద్ కైఫ్ ఫకీర్ను దోషిగా నిర్ధారించింది. రూ.15,000 జరిమానా కట్టించుకుని ఫకీర్ని విడుదల చేయాలని సూచించింది. అయితే పిలిచినప్పుడల్లా ఫకీర్ ప్రొబేషన్ ఆఫీసర్ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. 2022 ఏప్రిల్లో దక్షిణ ముంబైలోని బైకుల్లా పోలీస్ స్టేషన్ అందిన ఫిర్యాదు ప్రకారం.. స్థానిక మహిళ దగ్గర్లోని దుకాణం నుంచి కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేసింది. అందులో పనిచేసే వ్యక్తి వాటిని డెలివరీ చేయడానికి మహిళ ఇంటికి వెళ్లాడు. ఆర్డర్ డెలివరీ ఇచ్చిన అనంతరం నిందితుడు మహిళను ఒక గ్లాస్ నీళ్లు అడిగాడు. ఆమె నీటిని అందిస్తున్నప్పుడు ఆమె చేతులను తాకడంతోపాటు కన్నుకొట్టాడు. ఆర్డర్ డెలివరీ ఇస్తున్నప్పుడు కూడా చేతిని తాకి, కన్నుకొట్టాడు.
దాంతో మహిళ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అతను అక్కడ నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పడంతో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే కోర్టులో విచారణ సందర్భంగా సదరు వ్యక్తి మాట్లాడుతూ.. తాను పొరపాటున మహిళ చేతిని తాకానని, ఆమె నమ్రతను కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్పాడు. కానీ సాక్ష్యాధారాలు, మహిళ వాంగ్మూలం నిందితుడి జోక్యాన్ని రుజువు చేసేంత బలంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడి అతడిని దోషిగా తేల్చింది.